డిచ్పల్లి, జనవరి 19 : ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న ప్రైవేట్ వ్యాపార సంస్థలు, సముదాయాల ఆవరణలో విరివిగా మొక్కలను నాటించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని ధర్మారం, బర్ధిపూర్ గ్రామ శివార్లలోని నిజామాబాద్-హైదరాబాద్ ప్రధాన రహదారికిరువైపులా నా టిన హరితహారం మొక్కలను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. రోడ్డువెంబడి కల్యాణమండపా లు, పెట్రోల్బంక్లు, మార్బుల్దుకాణాలను గమనించిన కలెక్టర్.. ఖాళీ స్థలా ల్లో మొక్కలను నాటించాలని అధికారులకు సూచించారు. పలువురి వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరించారు. నాలుగైదు రోజుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. అవసరమైన మొక్కలను తామే సమకూరుస్తామని, వాటిని క్రమపద్ధతిలో నాటి ఏ ఒక్క మొక్క కూడా ఎండిపోకుండా సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటి సంరక్షిస్తే ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందన్నారు.
పెట్రోల్బంక్లకు రెండువైపులా 50 చొప్పున మొక్కలను నాటాలన్నారు. పెట్రోల్బంక్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన సమయంలో మొక్కలు నాటాలనే నిబంధన ఉంటుందని, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. మొక్కలను పశువులు తినకుండా ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ధర్మారం సర్పంచ్ పత్తి మమత, ఎంపీడీవో బ్రహ్మానందం, ఎంపీవో నాగేంద్రప్ప తదితరులు ఉన్నారు.
హరితహారాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
నిజామాబాద్ సిటీ, జనవరి 19 : హరితహారాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఎంపీడీవోలు, ఏపీవోలను కూడా ఉపేక్షించేది లేదన్నారు. కలెక్టరేట్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన అధికారులతో మాట్లాడారు. వచ్చే ఆరునెలలపాటు మొక్కల పెంపకం, వాటి నిర్వహణ విషయంలో అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, మోస్రా, వర్ని, చందూరు మండలాల పరిధిలో మొక్కల నిర్వహణ చక్కగా కనిపించిందన్నారు.
అలాగే రోడ్లకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కల సంరక్షణలో లోపాలు కనిపించాయని, నిజామాబాద్, బోధన్ ఎఫ్ఆర్వోలు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా అధికారులు ప్రతిరోజూ ఒక మండలాన్ని సందర్శించి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అటవీశాఖ అధికారులు క్రమం తప్పకుండా నర్సరీలను సందర్శిస్త్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అన్నారు. వీడియోకాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎఫ్వో సునీల్, డీఆర్డీవో చందర్నాయక్, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.