పహాడీషరీఫ్ : మహిళలు స్వశక్తితో రాణించి స్వయం ఉపాధి పొందాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ ఎస్.టీ హిల్స్ హై స్కూల్లో సోమవారం మహమ్మదీయ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి చేతుల మీదుగా కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 12 మంది మహిళలకు సిర్టిఫికెట్లు, కుట్టుమిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసోసియేషన్ పేద మహిళ కు కుట్టమిషన్ నేర్పిస్తూ అందులో ప్రావీణ్యం కలిగినవారికి అందజేయడం సంతోషకరమని సభ్యులను అభినందించారు.
సేవా కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత నెలకొంటుందన్నారు. ప్రస్తుతం ప్రమాదకరమైన ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకోనివారు వేయించుకోవాలని తెలిపారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకొని జల్పల్లి మున్సిపాలిటి పరిధిలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ జి.పి.కుమార్, కోఆప్షన్ మెంబర్ సూరెడ్డి క్రిష్ణారెడ్డి, కౌన్సిలర్ కేంచె లక్ష్మీనారాయణ, అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ఖాన్, ఉపాధ్యక్షుడు గౌస్ ఖాన్, ప్రదాన కార్యదర్శి అమానుల్లాఖాన్, కోశాధికారి సయ్యద్ ఖరీద్, టీఆర్ఎస్ నాయకులు, ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.