నిజామాబాద్ క్రైం/ఖలీల్వాడి, జనవరి 20: దవాఖాన భవనంపై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానలో గురువారం చోటుచేసుకుంది. వన్టౌన్ ఎస్హెచ్వో విజయ్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని మిర్చి కంపౌండ్ ప్రాంతానికి చెందిన బక్కోల్ల రాములు (70) అనారోగ్యంతో(దగ్గు, దమ్ము) కారణంగా ఈ నెల 18వ తేదీన జిల్లా ప్రభుత్వ దవాఖానలో చేరాడు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న రాములు గురువారం మధ్యాహ్న సమయంలో తన కుమారుడు నర్సయ్యను భోజనం చేసి రమ్మని ఇంటికి పంపించాడు. అనంతరం రాములు దవాఖాన భవనం మూడో అంతస్తుపైకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకాడు. దీంతో తలపగిలి అక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు వన్టౌన్ ఎస్హెచ్వో విజయ్ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. రాములు నగరంలోని ఓ దవాఖానలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడని, రెండేండ్ల క్రితమే పని మానేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు.