కోదాడ, జనవరి 10 : కోదాడ మున్సిపాలిటీ భవనం చుట్టూ ఉన్న స్థలాన్ని కొందరు ఆక్రమించి డబ్బాకొట్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని చిరువ్యాపారులకు అద్దెకిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. రెండు సంవత్సరాల క్రితమే పలువురు మాజీ ప్రజాప్రతినిధులు మున్సిపల్ కార్యాలయం వెనుక ప్రహరీని ఆనుకుని 30 డబ్బాకొట్లు ఏర్పాటు చేశారు. వాటి గురించి అధికారులు, పాలకవర్గం పట్టించుకోక పోవడంతో ఇంకో అడుగు ముందుకేసి పాత ఎస్బీహెచ్ ఎదుట మున్సిపాలిటీ స్థలంలో మరో 10 ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి ఆ ప్రాంతం ఖాళీగా ఉండగా.. బుధవారం తెల్లారేసరికి డబ్బాకొట్లు వెలియడంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది.
చిరు వ్యాపారులకు అద్దెకిస్తూ..
మున్సిపాలిటీ గోడను ఆనుకొని డబ్బా కొట్లను ఏర్పాటు చేస్తున్న వారు చిరువ్యాపారులకు అద్దెకిస్తున్నారు. అడ్వాన్స్, అద్దె రూపంలో వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ముందే ఆ వీధి చిన్నగా ఉండడం, పైగా డబ్బాకొట్టు ఏర్పాటు చేయడంతో కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పలు ప్రాంతాల్లోనూ..
పట్టణంలోని కోదాడ రోడ్డుకు ఇరువైపులా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆర్డీఓ కార్యాలయం ఎదుట, టెలికాం కార్యాలయం, హుజూర్నగర్ రోడ్లోని టీటీడీ కల్యాణ మండపం ప్రహరీని ఆనుకొని మొత్తం 300కు పైగా డబ్బా కొట్లు దర్శన మిస్తున్నాయి. పట్టణానికి చెందిన కొందరు డబ్బాకొట్లు ఏర్పాటు చేసి చిరు వ్యాపారుల నుంచి రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు అడ్వాన్స్తో పాటు నెలకు రూ. 4 నుంచి 15 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ఫలితంగా మున్సిపాలిటీకి దక్కాల్సిన ఆదాయానికి గండి పడుతున్నది. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు జోక్యం చేసుకొని ఆక్రమణలను తొలగించి మున్సిపాలిటీ స్థలాలను కాపాడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
తక్షణమే తొలిగిస్తాం
మున్సిపాలిటీ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా డబ్బా కొట్ల ఏర్పాటు మా దృష్టికి వచ్చింది. వాటిని తక్షణమే తొలగిస్తాం. కోదాడ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను ఉపేక్షించం.
-నాగేంద్రబాబు, మున్సిపల్ కమిషనర్, కోదాడ