బంజారాహిల్స్: వరుసగా సెలవులు రావడంతో జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని పద్మాలయ అంబేద్కర్నగర్ బస్తీలోని ప్రభుత్వ స్థలంలో వెలిసిన గుడిసెలను రెవెన్యూ సిబ్బంది సోమవారం కూల్చేశారు. షేక్పేట మండల పరిధిలోని పద్మాలయ అంబేద్కర్నగర్లో 40ఏళ్లుగా ఉంటున్న పేదలకు 2015లో టీఆర్ఎస్ ప్రబుత్వం జీవో 58కింద ఉచితంగా పట్టాలు జారీ చేసింది.
అప్పటికే ఉన్న గుడిసెలు తప్ప కొత్తగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోకుండా చూసే బాధ్యత తమదే అంటూ బస్తీకి చెందిన అన్ని పార్టీల నాయకులు చెప్పడంతో పాటు అడ్డదిడ్డంగా ఉన్న గుడిసెలను సరిచేసుకుంటామని రెవెన్యూ అదికారులను కోరారు.
దీంతో స్థానిక బస్తీ నేతలతో పాటు ప్రజా ప్రతినిధుల సమక్షంలో గుడిసెలను సరిచేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే కొంతమంది బస్తీనేతలు తమ వాళ్లకు స్థలాలు ఇప్పించాలనే ఉద్దేశ్యంతో అవకతవకలకు పాల్పడడంతో 80 శాతం సరిచేసుకున్న తర్వాత నిలిచిపోయాయి.
ఈ క్రమంంలో తాజాగా బస్తీకి చెందిన కొంతమంది లీడర్లు రంగంలోకి దిగి కొత్తగా గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంబించారు. క్రిస్మస్తో పాటు ఆదివారం కావడంతో రెండ్రోజుల వ్యవధిలో బస్తీని అనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏకంగా 14 గుడిసెలు వేయించారు.
ఒక్కో గుడిసెకు రూ.1లక్ష నుంచి రూ.3లక్షల దాకా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం షేక్పేట మండల తాసిల్దార్ శ్రీనివాసరెడ్డి దృష్టికి రావడంతో తక్షణమే ఆక్రమణలను తొలగించాలంటూ రెవెన్యూ సిబ్బందిని అదేశించారు. దాంతో రంగంలోకి దిగిన రెవెన్యూ సిబ్బంది బస్తీకి కింది భాగంలో ఉన్న మూడు గుడిసెలతో పాటు సిమెంట్తో కట్టిన పలు నిర్మాణాలను కూల్చేశారు.