ఖలీల్వాడి (మోపాల్), జనవరి 30 : నిజామాబాద్ జిల్లాను చలి వణికిస్తున్నది. రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. పొగమంచు జిల్లాను కప్పేస్తున్నది. సాయంత్రం 5గంటల నుంచే ప్రారంభమవుతున్న చలి మరుసటిరోజు ఉదయం 8గంటలు దాటినా తగ్గడం లేదు. రాత్రి చలికి పగలు చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కప్పేస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నది. చలి తీవ్రతకు ప్రజలు జలుబు, దగ్గు బారినపడుతుండగా, మరికొందరిని వైరల్ జ్వరాలు వెంటాడుతున్నాయి. కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చలి కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను, వైరస్ లక్షణాలను పోల్చుకోలేక ప్రజలు భయపడుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
పది రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు
తేదీ గరిష్ఠం కనిష్ఠం
21 30.2 16.5
22 32.2 17.7
23 28.2 16.2
24 28.2 16.2
25 24.3 14.9
26 26.3 14.9
27 26.7 15.2
28 26.4 13.5
29 26.1 12.3
30 28.0 12.2