ఖలీల్వాడి, మే 12 : హరితహారం లక్ష్య సాధనకు కృషి చేయాలని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు ఆయా శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో సమాయ త్తం కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. హరితహారంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లోని ప్రగతిభవన్ లో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ జిల్లాలో ఈ దఫా 45 లక్షల మొక్కలు నాట డం లక్ష్యం కాగా, నర్సరీల్లో ఒక కోటి వరకు మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారులకిరువైపులా వంద మీటర్ల దూరాన్ని ఎంచుకుని వరుసక్రమంలో మొక్కలు నాటేలా చూడాలన్నారు. సారంగాపూర్, చిన్నాపూర్ అర్బన్ పార్కుల్లోని ఖాళీ స్థలాల్లో, చెరువులు, కుంటలు, కాలువలతోపాటు ప్రధాన జలాశయాలైన నిజాంసాగర్, శ్రీరాంసాగర్ కాలువల వెంబడి మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గతంలో నాటిన మొక్కలను పరిశీలించి నివేదికను అందించాలని సూచించారు. వచ్చేవారం మళ్లీ హరితహారంపై సమీక్ష నిర్వహిస్తామని, సమగ్ర ప్రణాళికతో హాజరుకావాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా అటవీశాఖ అధికారి సునీల్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమ శాఖల పనితీరు మరింత మెరుగవ్వాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని వీడియోకాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల అధికారులతో ఆయన సమీక్షాసమావేశం నిర్వహించారు. ప్రతి హాస్టల్లో సీట్ల సంఖ్యకు అనుగుణంగా 100 శాతం అడ్మిషన్లు పూర్తికావాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమ య్యే నాటికి సంక్షేమ శాఖల అధికారులు విద్యార్థుల అడ్మిషన్ల విషయమంలో పక్కా ప్రణాళికతో సిద్ధం గా ఉండాలన్నారు.
వసతిగృహాలు పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంచేలా ప్రతి గదిలోని గోడలపై బొమ్మలతో కూడిన పెయింటింగ్స్ వేయాలని, నినాదాలు రాయించాలని సూచించారు. జూన్ 10వ తేదీ నాటికి మరమ్మతులను పూర్తి చేయించాలన్నారు. సమావేశం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖల అధికారులు శశికళ, నాగోరావు, నర్సయ్య, వసతిగృహాల సంక్షేమాధికారులు పాల్గొన్నారు.
గ్రూప్ ఎగ్జామ్స్తోపాటు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతీయువకులకు ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఇప్పటికే ఆన్లైన్ మెరిట్ టెస్ట్ ప్రాతిపదికన ఎంపికైన అభ్యర్థులకు ముందస్తు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయన్నారు.
వివిధ కారణాల వల్ల కొన్ని ఖాళీలు మిగిలి ఉన్నందున ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో జిల్లాలో అందిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాల్లో ప్రవేశాల కోసం నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చని కలెక్టర్ సూచించారు. పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం ఎస్సీ అభ్యర్థులు సోమశేఖర్(9440196945), గ్రూప్ ఎగ్జామ్స్ కోచింగ్ కోసం సీహెచ్ భూమయ్య (9346679373), పోలీసు ఉద్యోగ, గ్రూప్ ఎగ్జామ్స్ ఉచిత శిక్షణ కోసం బీసీ అభ్యర్థులు వెంకన్న (77330069466), ఎస్టీ పురుష అభ్యర్థులు ధనుంజయ్(9440235108), మహిళా అభ్యర్థినులు కల్పన(9966185910)ను సంప్రదించాని కలెక్టర్ సూచించారు.