బాన్సువాడ, మే 11: సమైక్యపాలనలో రైతులు పంటలను సాగుచేయాలంటే నీటి ఇబ్బందులతో సతమతమైన గడ్డు పరిస్థితులు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాల రైతాంగానికి కల్పతరువుగా ఉండేది. వానకాలంలో నీటితో నిండుగా ఉన్నా.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే నిజాంసాగర్ ప్రధాన కాలువ శిథిలావస్థకు చేరడంతో భూములన్నీ పడావుగా మారాయి. రైతు సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ నిజాంసాగర్ ప్రధాన కాలువతోపాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వల మరమ్మతుకు శ్రీకారం చుట్టారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.420కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో పనులన్నీ పూర్తయి ఆయకట్టుకు సాగునీరందుతున్నది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులకు సాగునీరు అందించే ప్రధాన కాలువ శిథిలావస్థకు చేరుకొని, ప్రాజెక్టు నుంచి వదిలిన సాగునీరు పంటపొలాలకు అందేది కాదు. అలాం టి పరిస్థితులను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులను మంజూరు చేయించారు. దీంతో నిజాంసాగర్ ప్రధానకాలువ మరమ్మతులు, కట్ట బలోపేతం, జంగల్ క్లియరెన్సు, సైడ్ వా ల్స్ బలోపేతం, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మా ణం, షటర్ల మరమ్మతులు, బ్రిడ్జిల నిర్మాణం, తదితర పనులకు సుమారు రూ.420 కోట్లు మంజూరయ్యాయి.నిజాంసాగర్ నుంచి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
1923లో నిజాం నవాబ్ కాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పనులు జరిగాయి. ప్రాజెక్టు కింద 2లక్షల30 వేల 339 ఎకరాలు విస్తీర్ణం ఉన్నప్పటికీ కాల్వల మరమ్మతుకు నోచుకోకపోవడంతో కేవలం 60శాతం రైతుల పంటలు మాత్రమే పండేవి. ప్రాజెక్టు నిర్మాణం జరిగి 80ఏండ్లు దాటి శిథిలావస్థకు చేరినా నిజాంసాగర్ ప్రాజెక్టు మరమ్మతు, ఆధునీకరణ పనులను నాటి సమైక్య పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం మొదటి సంవత్సరంలోనే సీఎం కేసీఆర్ నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు కంకణబద్దులయ్యారు. నిజాంసాగర్ నుంచి బాల్కొండ వరకు, నిజాంసాగర్, బాన్సువాడ, బోధన్, నిజామాబాద్, బాల్కొండ నియోజకవర్గాల రైతుల పంట పొలాలకు సాగునీరందించే ప్రధాన కాల్వకు మరమ్మతు, కట్ట బలోపేతం, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణంతో ఉమ్మడి జిల్లాలో సుమారు 50వేల నుంచి 60 వేల ఎకరాల్లో సాగువిస్తీర్ణం పెరిగిందని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం సహకారంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు కోట్లాది రూపాయలు మంజూ రు కావడంతో పనులన్నీ పూర్తయ్యాయి. రెండు పంటలకు సాగునీటి ఇబ్బందులుండవు. కాళేశ్వరం నీరు అవసరానికి అనుగుణంగా నిజాంసాగర్కు తెచ్చుకోవచ్చు. ఆధునీకరణ పనులతో ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారానికి ప్రత్యేక ధన్యవాదాలు.
-పోచారం భాస్కర్రెడ్డి , డీసీసీబీ చైర్మన్
80 ఏండ్ల కిందట కట్టిన కాల్వ లు.. తెలంగాణ రాక మునుపు ఏడపడితే ఆడ కరాబైనయ్. ప్రాజెక్టు నుంచి ఇడిసిన నీళ్లు మా పొలాల దాక అచ్చేవి కాదు. అప్పట్ల వోళ్లూ పట్టించుకోలే. తెలంగాణ అచ్చినంక పోచారం సార్ చేసుట్ల కాల్వలు మంచిగైనయ్. నీళ్లు గూడా మంచిగ అస్తున్నయ్. రెండు పంటలు పండుతున్నయ్.
-మొగులయ్య, రైతు, కొల్లూర్
వయసు మీద పడడంతో మోకాళ్ల సమస్య ఎదురైంది. చాలారోజుల నుంచి నడవడం, కూర్చోవడం ఇబ్బందిగా ఉండేది. సర్కారు దవాఖానల్లో డాక్టర్లకు చూపించుకుంటే ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఆపరేషన్ చేయించింది. కేసీఆర్కు, డాక్టర్లకు రుణపడి ఉంటాం.
-నీలాబాయి, సింగంపల్లి తండా,మాక్లూర్ మండలం