దేశమంతా కరెంట్ కొరత వేధిస్తుంటే మన దగ్గర మాత్రం విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, రాష్ట్రప్రభుత్వ సమర్థ ప్రణాళిక, సహకారంతో విద్యుత్ సంస్థలు 24 గంటలపాటు గృహాలకు నాణ్యమైన కరెంట్ను సరఫరా చేస్తున్నాయి. ఎండాకాలంలో విద్యుత్ వినియోగం విరివిగా పెరిగినా, ఎలాంటి లోటులేకుండా చూస్తున్నాయి.
అంచనాలకు మించి నిజామాబాద్ జిల్లాలో 5 మిలియన్ యూనిట్లు, కామారెడ్డి జిల్లాలో 2.4 మిలియన్ యూనిట్ల మేర డిమాండ్ ఏర్పడినా.. అందుకు తగ్గట్టుగా కరెంట్ సరఫరా చేస్తున్నాయి. ఫలితంగా ఒకప్పుడు విద్యుత్ కోతలతో అల్లాడిన పల్లెలు.. ఇప్పుడు నిరంతరం అందుబాటులో ఉన్న కరెంట్తో సాంత్వన పొందుతున్నాయి. పొరుగు రాష్ర్టాల్లో డిమాండ్కు తగిన విద్యుదుత్పత్తి లేక గంటలకొద్దీ కరెంట్ పోతుంటే, సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణలో అలాంటి కటకటల కాలానికి చెల్లుచీటి పడింది. కోతల్లేకుండా నిరంతరాయంగా కరెంట్ సరఫరా అవుతున్నది.
– నిజామాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సుబ్బారావు తాపీ మేస్త్రి. బతుకు దెరువు కోసం ఆంధ్రా నుంచి తెలంగాణకు వలస వచ్చాడు. కుటుంబంతో కలిసి కొద్ది కాలంగా నిజామాబాద్ జిల్లాలో జీవనం సాగిస్తున్నాడు. స్కూళ్లకు సెలవులు రావడంతో కుటుంబంతో కలిసి సొంతూరు ప్రకాశం జిల్లాకు వెళ్లాడు. వారం రోజులు గడిచిందో లేదో సుబ్బారావు కుటుంబం తిరిగి పని ప్రాంతానికి చేరుకున్నది. నెల రోజుల పాటు రాలేనంటూ సంతోషంగా బయల్దేరిన వ్యక్తి ఉన్న పళంగా కొద్ది రోజులకే సొంతూరు వదిలి రావడంపై అంతా ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందని అడిగే సరికి ఆంధ్రాలో కరెంట్ కటకట తీవ్రంగా ఉందంటూ నిట్టూర్చాడు.
పగలు, రాత్రి తేడా లేకుండా కరెంట్ కోతలతో ఇంట్లో ఉండలేక, బయట తిరగలేక అల్లాడిపోయినట్లు వివరించాడు. సొంతూర్లో కరెంట్ ఇబ్బందులు పడే బదులుగా హాయిగా తెలంగాణలోనే పని చేసుకుంటూ సంతోషంగా ఉండొచ్చంటూ తిరిగి వచ్చేసినట్లుగా సదరు వ్యక్తి వివరించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇలా వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి తెలంగాణలో జీవనం సాగిస్తున్న చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఇప్పుడు కోకొల్లలుగా దర్శనం ఇస్తున్నాయి. అందులో సుబ్బారావు వ్యవహారం ఒక ఉదాహరణ మాత్రమే.
ఆట్ సాల్ కింద ఎండాకాలంల కరంటు బరాబర్ ఉండకపోతుండె. పగలు ఇంట్ల ఉండాలంటే గరమ్కు బర్దాష్ అయ్యేది గాదు. పంకలు, కూలర్లు ఉన్నా కరంటు ఉండక, గవి ఉండీలేని కిందనే అనిపిస్తుండే. కేసీఆర్ సాబ్ సీఎం కాంగనే కరంటును సుదరాయించిండు. 24గంటలు ఇంట్ల జబర్దస్త్ కరంటు ఉంటున్నది. గిట్ల కూలర్లు, పంకలు పెట్టుకునే అదృష్టం కలిగింది.
-అబ్దుల్ ముజీబ్, ఎన్టీఆర్ కాలనీ, బాల్కొండ
నేను ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. గతంలో కరెంటు పగలు ఉంటే రాత్రి ఉండేది కాదు. రాత్రి ఉంటే పగలు ఉండేది కాదు. ఆ ఉన్న కాసేపు నిలకడగా అసలే ఉండేది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ అంతటా 24గంటలు కరంటు ఉంటున్నది. దీంతో నా వర్క్ ఫ్రం హోమ్ ఇబ్బంది లేకుండా సాగుతున్నది.
-తాళ్ల రమేశ్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, కిసాన్నగర్, బాల్కొండ
నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్లో ఉన్నాను. దేశంలో ఎన్నో రాష్ర్టాల్లో విద్యుత్ కోతలు ఉంటే.. తెలంగాణలో మాత్రం నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతున్నది. ఇంటి వద్దనే కాకుండా చుట్టాల ఇంటికో.. ఏదైనా ఫంక్షన్లకో వెళ్లినా కూడా వర్క్ చేసుకునే పరిస్థితి కలిగింది. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వ ఘనత.
-ప్రశాంత్ గౌడ్, మెండోరా, భీమ్గల్
నేను దుబాయ్లో కొన్నేండ్లు పనిజేసిన. ఆ దేశంలో కరెంటు పోవుడనేది ఉండదు. ఎప్పుడన్నా చుట్టీ మీద ఇంటికి వచ్చినప్పుడు ఇంటికాడ గంటల కొద్ది కరెంటు ఉండేది కాదు. దీంతో బాగ తక్లీబయ్యేది. గిదేం దేశంరా బాబు.. దుబాయ్ లెక్క గీడ మా ఇండ్లళ్ల సుక కరెంటు ఎప్పుడూ ఉంటే ఎంత మంచిగుంటదో అనిపిస్తుండే. కేసీఆర్ సార్ సీఎం అయినంక ఎర్రటెండల్ల గూడ మా వూర్ల సుక సేం దుబాయ్ లెక్కనే ఇరవై నాలుగ్గంటలు ఇండ్లళ్ల కరెంటు ఉంటున్నది.
-బోదాసు పడిగెల పెద్ద గంగారాం, తాళ్లరాంపూర్, ఏర్గట్ల మండలం
2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త. ఇప్పుడు తెలంగాణలో కరెంట్ పోతే వార్త. కరెంట్ పోవడమంటే చీటికి మాటికి సరఫరా నిలిపేయడమంటూ ఎక్కడా లేదు. కేవలం మరమ్మతులు, విద్యుత్ స్తంభాలకు అడ్డొచ్చిన చెట్ల కొమ్మలు తొలగించడం వంటి పనులకే విద్యుత్ను తాత్కాలికంగా నిలిపేసి పునరుద్ధరిస్తున్నారు.
గంటల కొద్దీ నిత్యం కరెంట్ తీసేసే రోజులు తెలంగాణలో కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. రోజురోజుకూ గృహ అవసరాలకు డిమాండ్ పెరిగినప్పటికీ అందుకు తగ్గట్లుగా సరఫరా సాగుతుండడం విశేషం. నిజామాబాద్లో 5 మిలియన్ యూనిట్లు, కామారెడ్డిలో 2.4 మిలియన్ యూనిట్ల డిమాండ్ అంచనాలను దాటుకొని విద్యుత్ వినియోగం అవుతున్నప్పటికీ సరఫరాలో ఆటంకం అనేది కానరావడం లేదు. ఎండాకాలంలో ఓ వైపు వ్యవసాయ రంగం, మరోవైపు గృహ విద్యుత్ వినియోగం ఏకకాలంలో రెట్టింపు అయినప్పటికీ కరెంట్ లోటు లేకుండా చూడడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమవుతున్నది.
జాతీయ సగటు విద్యుత్ వినియోగంతో పోలిస్తే రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగమే ఎక్కువగా ఉండడం సాధారణ విషయమేమీ కాదు. 24 గంటల విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన మౌలిక సౌకర్యాలు, కొత్తగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వంటి చర్యలతో రికార్డులను బ్రేక్ చేస్తున్నది. నిరంతర విద్యుత్ సరఫరా వెనుక సీఎం కేసీఆర్ కృషి దాగి ఉన్నది. ఇందుకోసం సబ్ స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాటు, సరఫరా నెట్వర్క్ పటిష్ఠత లాంటి చర్యలు అనేకం ఉన్నాయి.
గతంలో మాదిరి ఇండ్లలో కరెంటు కోతలు పూర్తిగా పోయాయి. 24 గంటలు కరెంటు ఉంటున్నది. దీంతో కాలేజీలకు వెళ్లి వచ్చాక విద్యార్థినులు, యువతులకు ఇంటి వద్ద కరెంటుతో నడిచే కుట్టుమిషన్పై పని నేర్చుకునేందుకు, పని చేసుకునేందుకు ఇబ్బందులు తొలగిపోయాయి.
-రోహిణి, ముప్కాల్
తెలంగాణ రాక ముందు ఒక రోజులో ఏ కొద్ది గంటలో ఇంట్లో కరెంటు ఉండేది. ఉదయా న్నే ఇంటి పనులు చూసుకొని ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు కరెంటు కష్టాలు వెంటాడేవి. సీఎం కేసీఆర్ పట్టుదల తో కరెంటు సమస్యలను లేకుండా చేశారు.ఈ మార్పు మహిళలకు వరంలాంటిదే అని చెప్పవచ్చు.
-అమరగోని రోజా,
సర్పంచ్, ఆర్.ఆర్.నగర్, కమ్మర్పల్లి
కేసీఆర్ సర్కారు రాక ముందు కరెంటు ఉండేది తక్కువ..పోయేది ఎక్కువ అన్నట్లుండేడిది. ఒక్కోపారి బగ్గ కరంటు వచ్చి టీవీలు, ఫ్రిజ్జులు, ఫ్యాన్లు కాలిపోయేటివి. అప్పట్లో మా ఇంట్లోనూ టీవీ కాలిపోయింది. గీ కరంటు పాడు గాను అనిపిచ్చేది. కానీ ఇప్పుడు ఎండాకాలంలో కూడా 24 గంటలు మంచి కరంటు ఉంటున్నది.
-సంతోషి, గృహిణి, భీమ్గల్
2014కు ముందు ఎండాకాలంలో ఇంటి పట్టున ఉండి చదువుకోలేని పరిస్థితి ఉండేది. పగలు వేడి..రాత్రి కరెంటు కోతలతో చదువులకు ఇబ్బంది కలిగేది. ప్రస్తుతం పగలు, రాత్రి ఫుల్ కరెంటుతో ఇంట్లోనే కూలర్ పెట్టుకొని పోటీ పరీక్షలకు చక్కగా ప్రిపేర్ అవుతున్నాం.
-వెంకటేశ్, ముప్కాల్
దేశంలో ఒక్క తెలంగాణ తప్ప మిగిలిన అనేక రాష్ర్టాల్లో కరెంట్ కటకట కొనసాగుతున్నది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు సరిపడా విద్యుత్ లేక అనేక రంగాలు కుదేలవుతున్నాయి. అంతేగాకుండా సామా న్య ప్రజలు తమ కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా కరెంట్ అందుబాటులో లేకపోవడంతో సతమతం అవుతున్నారు. మహారాష్ట్రలోనూ చాలా రోజులుగా విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. వ్యవసాయానికి కేవలం ఆరు గంటల పాటు ఇచ్చే విద్యుత్ సరఫరాలోనూ ఇప్పుడు అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తున్నది.
కర్ణాటకలోనూ ఇదే దుస్థితి కనిపిస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సరిహద్దు రాష్ర్టాల్లో కరెంట్ పరిస్థితి దారుణంగా మారింది. పొరుగు రాష్ర్టాల్లో డిమాండ్కు తగిన విద్యుత్ ఉత్పత్తి లేక చతికిల పడుతున్న దుస్థితి కనిపిస్తున్నది. తెలంగాణలో మాత్రం అలాంటి కటకటల కాలానికి సీఎం కేసీఆర్ ముందుచూపుతో చెల్లు చీటి పడింది. సమైక్య పాలనలో ఇదే రకమైన కరెంట్ కోతలతో అల్లాడిన తెలంగాణ.. ఇప్పుడు నిరంతర విద్యుత్ వెలుగుల్లో జిగేల్మంటున్నది. ఒకప్పుడు వ్యవసాయ పొలాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే గగనం. దీంతో బోర్లు లేక చక్కని వ్యవసాయ భూములన్నీ పడావుగా కొనసాగేవి. రైతుకు విద్యుత్ కనెక్షన్ రావాలంటే సంబంధిత అధికారులకు లంచాలు ఇస్తే కానీ కనెక్షన్ మంజూరయ్యేది కాదు.
కనెక్షన్లు ఇచ్చినా చీటికి మాటికి ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు, బోర్లు చెడిపోవడం వంటి కష్టాలు నిత్య కృత్యమే. ఫలితంగా ఆర్థిక భారం విపరీతంగా రైతులపై పడేది. కానిప్పుడు విద్యుత్ కనెక్షన్లకు తిప్పల్లేవు. కరెంట్ సరఫరాలో ఆటంకాలు అంతకన్నా లేవు. సాగు రంగానికి అందుతున్నట్లే గృహ, వాణిజ్య అవసరాలకు సైతం నిరంతర కరెంట్ సరఫరా కొనసాగుతున్నది. ప్రస్తుతం మండుతున్న ఈ ఎండాకాలంలో విద్యుత్ వినియోగం అంచనాలను దాటుతున్నది.