మాక్లూర్, సెప్టెంబర్ 25: మండల కేంద్రమైన మాక్లూర్లోని ప్రభుత్వ ఉన్నత,ప్రాథమిక పాఠశాలల నిర్మాణానికి మొత్తం రూ.5.70 కోట్లు సమకూరినట్లు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు తెలిపారు. శనివారం ఆయన మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా రూ.4.70 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. దీనికి తోడు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ బిగాల మహేశ్ తండ్రి బిగాల కృష్ణమూర్తి, తాత బిగాల గంగారాం జ్ఞాపకార్థం మరో రూ. కోటి విరాళంగా ఇచ్చారని, మొత్తం కలిపి రూ. 5కోట్ల 70లక్షలు సమకూరినట్లు వివరించారు. పాఠశాల భవనాల నిర్మాణ పనులు త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివేశారని, ప్రత్యామ్నాయంగా విద్యార్థులకు తరగతులను నిర్వహించడానికి సమీపంలో ఉన్న బిగాల కృష్ణమూర్తికి చెందిన గోదాములను పరిశీలించినట్లు చెప్పారు. రూ.కోటి విరాళంగా ఇచ్చిన అర్బన్ ఎమ్మెల్యేకు ఆయన ధన్యవాదాలు తెలి పారు. సర్పంచ్ అశోక్రావు, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ మర్ల దత్తాద్రి,కో-ఆప్షన్ సభ్యులు హైమద్, నాయకులు నర్సాగౌడ్, లక్ష్మీనారాయణ, సాయిలు, గంగాధర్,రాజేందర్, నజీబ్, పాషా, హెచ్ఎంలు శ్రీహరి, మోహన్ ఉన్నారు.