నిజామాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలోని బీజేపీ తీరుపై సామాన్య ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ప్రతి ఏటా జనంపై బాదుడు విధానాన్ని అవలంబిస్తున్నది. ఈసారి వార్షిక బడ్జెట్లోనూ వరాల కన్నా భారమే ఎక్కువగా ఉంది. గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన వివిధ రూపాల్లోని పన్నులను అలాగే కొనసాగిస్తూ తాజాగా ఊరటనిచ్చే నిర్ణయాలేవీ లేకపోవడంతో సబ్బండ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని మోదీ సర్కారు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో వివక్షను కొనసాగిస్తున్నదని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు 2022-23లో ప్రకటించిన బడ్జెట్ ముఖ్యాంశాలే నిదర్శనం అంటున్నారు. కేంద్ర బడ్జెట్తో విభజన హామీలు అమలు పర్చకపోవడంతో పాటు ప్రత్యేకంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చేకూరిన ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. విత్తమంత్రి నిర్మలా సీతారామన్ గతంలో మాదిరిగానే గణాంకాలను చదివి వినిపించారే తప్ప… పేదోడికి లాభం చేకూర్చే విధంగా మాత్రం బడ్జెట్ను రూపొందించలేకపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు ఉమ్మడి జిల్లాకు ప్రయోజనం జరిగే ఏ ఒక్క అంశాన్ని ఆర్థికమంత్రి ప్రస్తావించకపోవడం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పనితీరును తేటతెల్లం చేస్తున్నది.
మన ఊసే కరువు…
ఉత్తర తెలంగాణలో రైల్వేలైన్ విస్తరణ, నూతన రైళ్లపై ప్రకటన గురించి బడ్జెట్లో ఊసే ఎత్తలేదు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి ముగ్గురు బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రాంతానికి లాభం చేకూర్చే నిర్ణయాలను అమలు చేయడంలో విఫలమయ్యారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న రైల్వే వివక్ష ఈసారి కూడా అదే రీతిలో ఉండడంతో బీజేపీ తీరుపై ప్రజలు అంసతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజలు ఎంతగానో ఆశిస్తున్న బోధన్-బీదర్ రైల్వే లైన్ ప్రస్తావన లేదు. ఆర్మూర్ – నిర్మల్ – ఆదిలాబాద్ రైల్వే లైన్ సంగతే మరిచిపోయారు. నిజామాబాద్ జంక్షన్ మీదుగా డబ్లింగ్ చర్యలు అన్నమాటే వినిపించలేదు. ప్రత్యే క, కొత్త రైళ్ల ప్రకటన లేకపోవడం వంటివి జిల్లా ప్రజలను తీవ్రంగా కలిచి వేస్తోంది. ప్రజలను చీటికి మాటికి రెచ్చగొట్టడంలో చూపించే శ్రద్ధాసక్తులు రైల్వే ప్రాజెక్టుల మంజూరుపై ఎందుకు చూపించబోరంటూ ప్రశ్నిస్తున్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకపోవడంపై ఉమ్మడి జిల్లా ప్రజలు కేంద్ర సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. నూతన రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్లు, రైల్వే లైన్లు, డబ్లింగ్ పనులకు గతంలో బడ్జెట్లో కేటాయింపులు జరిపినప్పటికీ ఇప్పటికీ పనులు మొదలవ్వలేదు. ఈసారి వాటి మాటనే ఎత్తలేదు.
గాలికి వదిలేసిన హామీలు…
కేంద్ర వార్షిక బడ్జెట్పై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. పసుపు బోర్డు, పరిశ్రమల విషయంలో ఏమైనా ప్రకటనలు ఉంటాయని భావించారు. ఈసారైనా కేంద్రం తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేస్తుందని ఆశించగా నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో రైతుల ఆదాయం పెంచేందుకు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. కానీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటనపై కనీసం మాటెత్తలేదు. పసుపు రైతుల చిరకాల స్వప్నంపై బీజేపీ మరోమారు నిర్లక్ష్యం వహించడంపై రైతులు తమ ఆందోళనను ఇక తీవ్రతరం చేయడమే పరిష్కారమంటూ నిర్ణయానికి వస్తున్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోగా రైతులను మాయ మాటలతో మోసం చేస్తున్నారని అన్నదాతలు మం డిపడుతున్నారు. పసుపు బోర్డు, రైల్వే పెండింగ్ పనుల కోసం 2014 – 2019 వరకు టీఆర్ఎస్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ప్రాధాన్యత స్థాయిలో పని చేశారు. ఆమె కృషితోనే పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వే లైన్ పూర్తి కాగా… స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ ఏర్పాటుపై ప్రతిపాదనలు వచ్చాయి. బోర్డు ఒక్కటే పరిష్కారమని నాడు కవిత డిమాండ్ చేయగా… ప్రస్తుత ఎంపీ అదే రీజినల్ సెంటర్కు ఆమోదం తెలిపి బోర్డుకు మంగళం పాడారు. రైతులకు ఇదే బోర్డంటూ రోజుకో మాట చెబుతూ మోసం చేస్తున్నాడు. కేంద్రంలో బీజేపీ సర్కారే ఉన్నప్పటికీ అర్వింద్ మాత్రం ఢిల్లీ పెద్దలతో మాట్లాడి నిజామాబాద్ జిల్లాకు మేలు చేయడంలో ఇసుమంతైనా పాటుపడకపోవడంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ రంగానికి నిరాశే
నల్లచట్టాలతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న కేంద్రం బడ్జెట్లోనూ అన్నదాతను చిన్న చూపు చూసింది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఊరటనిచ్చే అంశం ఒక్కటీ బడ్జెట్లో ప్రవేశ పెట్టలేదు. ఎరువుల ధరల తగ్గింపు మాటే లేదు. వ్యవసాయరంగానికి బడ్జెట్లో కేటాయించింది ఏమీ లేదు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
వేతన జీవులకు ప్రయోజనం శూన్యం..
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను రా యితీ ఊసే లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు, రైతులకు, సామాన్యులకు, వృత్తి కులాలకు, ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసింది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆదాయపన్ను స్లాబులు మార్చలేదు. పన్ను రాయితీ పెంచకపోవడంతో ఉద్యోగ వర్గాలు, పన్ను చెల్లింపుదారులు నిరాశకు గురయ్యారు.
వైద్యరంగంపై చిన్నచూపు..
వైద్యం, ప్రజారోగ్యం, మౌలిక రంగాలను అభివృద్ధి పర్చడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేట తెల్లమైంది. కరోనా నేపథ్యంలో ప్రపంచదేశాలన్నీ వైద్య రంగంలో మౌలిక వసతులను అభివృద్ధి పరుస్తుం టే.. ఆ దిశగా కేంద్రం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. వైద్యరంగానికి నిధులివ్వకపోతే మౌలిక వసతుల పురోగతి, కరోనాపై యుద్ధం ఎలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు.