వైభవంగా అధ్యయనోత్సవాలుయాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ అధ్యయనోత్సవాలు శాస్ర్తోక్తంగా కొనసాగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండోరోజు స్వామికి ప్రభాత వేళ తిరుప్పావై మహోత్సవం, నవ కలశాభిషేకం, మూలమంత్ర హోమం జరిపారు. అనంతరం స్వామిని వేణుగోపాల స్వామిగా అలంకరించి పురప్పాట్ సేవలు చేపట్టి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, పండితులు, రుత్వికులు ప్రత్యేకంగా పాశురాలను పఠించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
యాదాద్రి, జనవరి14
ఉదయం వేణుగోపాల స్వామిగా..
బాలాలయంలో రెండోరోజు అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఉదయం పారాయణికులతో దివ్య ప్రబంధ పారాయణాలు నిర్వహించారు. అనంతరం అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామిని వేణుగోపాల స్వామిగా అలంకరించి ఊరేగించారు.
అలంకార విశిష్టత..
దుష్ట శిక్షణ, శిష్ణ రక్షణకై అవతరించిన భగవత్ అవతారాల్లో పరిపూర్ణమైన అవతారం శ్రీకృష్ణావతారం. వేణుగోపాలుడి చేష్టలు ఎంతో మధురం. ప్రకృతిలోని పశువులు, పక్షులు, గిరులు, లతలు వేణుగానానికి పరవశించి ఆనందాన్ని పొందుతాయని భాగవతం సూచిస్తున్నది. ప్రకృతిలో అందరూ తనవారేనని, వారికి కలిగిన దుఃఖాన్ని తొలగించుటే అవతార ప్రయోజనమని వేణుగోపాల అవతారం సూచిస్తుంది. ప్రణవమే వేణుగానంగా వినిపించి లోకాల తరింపే అలంకార ప్రత్యేకత.
అలంకార విశిష్టత..
శ్రీకృష్ణ పరమాత్మ అవతారమూర్తియే కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. శ్రీకృష్ణ భగవానుడు చూపిన లీలలన్నీ భక్త రక్షణార్థమే. భగవానుడు గోవర్ధనగిరి ధారియై ఇంద్రుడి గర్వాన్ని తొలగించి భక్తులను రక్షించిన తీరు ఈ లీలలో దర్శించవచ్చు. శరత్ రుతువులో ఇంద్రుడి అనుగ్రహం పొంది బృందావనంలో ఇద్రోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. కృష్ణ పరమాత్మ ఇంద్రుడి గర్వాన్ని తొలగించేందుకు ఆ ఉత్సవం నిలిపివేశాడు. దీంతో ఇంద్రుడు గర్వాందుడై బృందావనంపై కుంభవృష్టి కరిపించి గొల్లలను, గోవులను, ఇతర పశుగణాలను భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఈ సమయంలో కృష్ణభగవానుడు గోవర్ధనగిరిని అవలీలగా తన చిటికెన వేలుపై నిలబెట్టి అందరినీ కాపాడుతారు.
సాయంత్రం గోవర్ధనగిరిధారిగా..
స్వామి ద్రావిడ ప్రబంధ సేవాకాలాన్ని పారాయణికులు, అర్చకులు సాయంత్రం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామిని గోవర్ధనగిరిధారిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వేడుకల్లో ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారులు దోర్బల భాస్కర్శర్మ, గజవెల్లి రమేశ్బాబు, శ్రవణ్కుమార్, పర్యవేక్షకులు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.