పిలుపునందుకుని జిల్లా రైతాంగం కొత్తదారిలో పయనిస్తున్నది. ఏండ్ల తరబడి వరి మాత్రమే వేసిన భూముల్లోనూ పంట మార్పిడి మొదలుపెట్టింది. నీటి వసతి ఎక్కువగా ఉన్నచోట వరికి ప్రాధాన్యం ఇస్తున్నా.. అత్యధిక ప్రాంతాల్లో ఇతర పంటల సాగువైపు ఆసక్తి కనబరుస్తుండడం విశేషం. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 18,586 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగైనట్లు వ్యవసాయ గణాంకాలు చెప్తుండగా, అందులో 14,760 ఎకరాల్లో వరి వేశారు. మిగతా విస్తీర్ణంలో ఎప్పుడూ లేనంతగా ఇతర పంటలు వేయడం శుభపరిణామం. రైతులు వరి తర్వాత అధికంగా మినుములు, పెసర, పల్లి సాగు చేశారు. ప్రస్తుతం జిల్లాలో పంటల సాగు దాదాపు 20 శాతం పూర్తయ్యింది. గత యాసంగిలో ఇప్పటివరకు చూస్తే 80వేల ఎకరాల్లో వరి వేశారు. దాంతో పోలిస్తే ఈసారి వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గనున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. యాసంగి ధాన్యం కొనేది లేదని కేంద్రం కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ నిర్వహించిన అవగాహన సదస్సులు, పంట మార్కెటింగ్ ఇబ్బందుల్లేక డిమాండ్ ఉన్న పంటలనే వేసుకోవాలని రైతుల ఆలోచన కూడా ఈ విధమైన మార్పునకు దోహదపడ్డాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో వరి సాగు తగ్గి, మెట్ట పంటల సాగు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం యాసంగి నుంచి వరి ధాన్యం కొనబోమని స్పష్టం చేసిన
నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇతర పంటలే వేసుకోవాలని రైతాంగానికి సూచించింది. ఈ క్రమంలో రైతులు పంటల మార్పిడి పాటిస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న వరి స్థానంలో ఇతర రకాలు సాగు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. సాధారణంగా నీటి లభ్యత ఆధారంగా యాసంగి సీజన్లో ప్రతియేటా మూడు లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తారు. ఇందులో మూడొంతులు వరి ఉంటుంది. ఆ తర్వాత పత్తి, మొక్కజొన్న, జొన్న, మినుములు వంటివి ఉంటాయి. ఈ ఏడాది యాసంగిలో ఇప్పటివరకు 18,586 ఎకరాల్లో వివిధ రకాల పంటలను వేయగా ఇందులో 14,760 ఎకరాల్లో వరి వేశారు. చెరువులు, కుంటలు, ఇతర నీటి వసతి ఉన్నచోట్ల మాత్రమే వరి వేయగా ఇతర పంటలకు అవకాశం ఉన్నచోట తప్పనిసరిగా ఆరుతడి పంటలకే రైతులు ప్రాధాన్యతమిస్తున్నారు.
జిల్లాలో సేద్యానికి అనుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతియేటా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా వరి సాగుతోపాటు ధాన్యం దిగుబడులు సైతం పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనేందుకు ససేమిరా అంటున్న నేపథ్యంలో వరికి బదులు ఇతర పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా రైతులను చైతన్యపర్చే కార్యక్రమాలను చేపట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుకుని అధికార యంత్రాంగం సైతం క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించారు. భూసార పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని రైతులు పంట మార్పిడికి పూనుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. వ్యవసాయ శాఖ ప్రాంతాల వారీగా నేల రకాలను బట్టి అధిక ఆదాయాన్ని ఇచ్చే అపరాలు, నూనె గింజల పంటలు, కూరగాయలు, పండ్ల తోటల సాగును ప్రోత్సహించి సత్ఫలితాన్ని రాబట్టింది.
అపరాలు, నూనె గింజల పంటల వైపు..
జిల్లాలో వ్యవసాయ శాఖ సూచనల మేరకు నేలల రకాల ఆధారంగా అపరాలు, నూనె గింజల పంటల వైపునకు రైతులు మళ్లారు. పెసర, మినుము, శనగ పంటతోపాటు బొబ్బర, కంది పంటలను సాగు చేస్తున్నారు. నూనె గింజల పంటల్లో ప్రధానంగా మినుము సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నువ్వులు వేశారు. మరికొన్ని చోట్ల చిరు ధాన్యాలతోపాటు పొద్దు తిరుగుడు, మొక్క జొన్న, జీలుగ, గోధుమ పంటల సాగు కొనసాగుతున్నది.
బీర, టమాట వేసిన..
వరికి బదులు ఇతర పంటలేయాలని అధికారులొచ్చి చెప్పిండ్రు.. ప్రభుత్వం కూడా అదే చెప్తున్నదని ఈ సారి బీర, టమాట పంటలేసిన.. నాకు నాలుగు ఎకరాలు ఉండగా గతంలో మొత్తం వరి వేసేది.. ఇప్పుడు రెండెకరాలకుపైగా ఇతర పంటలే పడిస్తున్నా..వరి మొత్తమే వేయలే.. దిగుబడి వచ్చిన తర్వాత మరిన్ని పంటలు సాగు చేస్తా..
-గాజుల నర్సయ్య, రైతు, మహబూబ్పేట,
యాదగిరిగుట్ట మండలం వరి వద్దన్నందుకే..
ఈ సారి యాసంగిలో వరికి బదులు వేరే పంటలు వేసిన.. వరి కొనమని కేంద్రం చెప్పడంతో ఈ సారి పంటలు మార్చిన.. నాకున్న మూడెకరాల్లో ఒక ఎకరంలో సన్నరకం వరి, ఎకరంలో నువ్వులు, మరో ఎకరంలో మినుము సాగు చేస్తున్నా. అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలు సాగు చేస్తున్నా..
-బూర్గు బాల్రెడ్డి, రేణికుంట, రాజాపేట మండలం