వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెంకట్రాములు
అచ్చంపేట, మార్చి 29: అటవీప్రాంతంలో 29 రకాల అటవీ ఉత్పత్తులు సేకరించుకునే హక్కు గిరిజనులకు ఉందని, గిరిజనులపై అటవీ అధికారుల వేధింపులు ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెంకట్రాములు అన్నారు. అటవీ అధికారుల దాడిలో గాయపడిన గిరిజనులను పరామర్శించారు. సోమవారం అచ్చంపేట మండలం చెంచుపలుగుతండాకు వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనులపైదాడి చేయడమే కాకుండా వారిపై అక్రమ కేసు నమోదు చేయించేందుకు పూనుకున్న అటవీఅధికారుల తీరు దురహంకారానికి నిదర్శనమన్నారు. గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వు విలువ రూ. లక్షాయాభైవేల వరకు ఉంటుందన్నారు.
గిరిజనుల నుంచి లాక్కున్న ఇప్పపూలను తిరిగి గిరిజనులకు అందజేయాలని, దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలన్నారు. వంట పాత్రలు, బట్టలు అక్కడే కాల్చి వేశారన్నారు. దాడి చేసినవారిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆయన వెంట నాయకులు లక్ష్మణ్, మలేశ్, ఆంజనేయులు, కవిత, గ్రామస్తులు పాల్గొన్నారు.