నిజామాబాద్ రూరల్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ, ద్వంద్వ వైఖరిని అవలంబించడమే పనిగా పెట్టుకున్నదని ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ అన్నారు. శుక్రవారం ఆయన ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గడీల రాములు, డీసీసీబీ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకలు అమలుచేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని నీరుగారుస్తోందన్నారు. ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరిచే చర్యలు చేపట్టడం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయితే బీడు భూములకు సాగునీరంది సస్యశ్యామలంగా మారుతాయన్నారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే ఆందోళనకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఏనాడు కూడా పార్లమెంట్లో జిల్లా ప్రజలు, రైతుల సమస్యలపై నోరు విప్పిన దాఖలాలు లేవన్నారు. మీడియా వేదికగా మాత్రమే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, రాష్ట్రంలో అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్, మంత్రులపై విమర్శలు గుప్పిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కొర్వ దేవేందర్, బొల్లెంక గంగారెడ్డి, నరేష గోర్కంటి లింగన్న, శ్రీనివాస్రావు, ముత్యంరెడ్డి, విండో చైర్మన్లు శ్రీధర్, గంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.