అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ పైప్లైన్ల ఏర్పాటు, వర్షపునీటి పైప్లైన్ల నిర్మాణం, పార్కుల సుందరీకరణ వంటి అనేక పనులు జరుగుతున్నాయని చెప్పారు.
బాగ్అంబర్పేట డివిజన్ పోచమ్మబస్తీలో రూ. రూ.9 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న మంచినీటి పైప్లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి సక్రమ సరఫరాకు జలమండలి నుంచి తొమ్మిది లక్షలు మంజూరు చేయించి కొత్త పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ పనులు పూర్తయితే మంచినీటి సమస్య పూర్తిగా తీరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్ డీజీఎం సతీష్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, నాయకులు శ్రీరాములుముదిరాజ్, మహేష్, చంద్రశేఖర్, డా.సులోచన, బొట్టుశ్రీను తదితరులు పాల్గొన్నారు.
వాంబే కాలనీ పార్కు పనులకు శంకుస్థాపన..
బాగ్అంబర్పేట డివిజన్లోని వైభవ్నగర్ (వాంబే) కాలనీ పార్కులో రూ.9.70లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించారు. పార్కులో వాకింగ్ ఫుట్పాత్ నిర్మాణం, బల్లల ఏర్పాటు, ఆహ్లాదకరమైన గ్రీనరీ ఏర్పాటు వంటి పనులను చేపట్టనున్నట్లు వారు తెలిపారు.