అధికారులుప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ)కి వరుస పండుగలు కలిసి వచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో బతుకమ్మ, దసరా పండుగలకు ఆర్టీసీ 665 ప్రత్యేక నడిపింది. ఈ బస్సులు 14.50 లక్షల కిలోమీటర్లు ప్రయాణించగా.. రూ.4.70 కోట్ల ఆదాయం సమకూరింది. కరోనా నేపథ్యంలో ప్రయాణికులు తగ్గి ఆర్టీసీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఇటీవల మళ్లీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని ప్రయాణికులు విశ్వస్తున్నారు. దీంతో సంస్థకు లాభాలు వస్తున్నాయి. బతుకమ్మ, దసరా పండుగలకు పక్కా ప్రణాళికలతో అన్ని రూట్లకు బస్సులు నడిపి ఆర్టీసీ మంచి ఆదాయాన్ని పొందింది. డ్రైవర్లు, కండక్లర్లు, అధికారులు, ఇతర సిబ్బంది బాగా శ్రమించారు. పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీకి కాసుల పంట పండింది. బతుకమ్మ, దసరా పండుగలు ఆర్టీసీకి కలిసివచ్చాయి. పండుగలతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీకి రూ.4.70 కోట్ల ఆదాయం వచ్చింది. కొవిడ్ కారణంగా రెండేండ్లుగా ఆర్టీసీకి సరైన ఆదాయం రావడం లేదు. బతుకమ్మ, దసరా పర్వదినాల సందర్భంగా ఆర్టీసీ బస్సులు వారం రోజుల్లో 14.50 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి. దీంతో వారం రోజుల్లో రూ.4.70 కోట్ల ఆదాయం లభించింది. 18వ తేదీ ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.1.06 కోట్ల ఆదాయం వచ్చింది. పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో ఆర్టీసీ సిబ్బంది సంతోషంగా ఉన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 డిపోలు..
ఉమ్మడి మెదక్ జిల్లా (మెదక్ ఆర్టీసీ రీజియన్) పరిధిలో ఎనిమిది డిపోలు ఉన్నాయి. సంగారెడ్డి డివిజన్ పరిధిలోని సంగారెడ్డి, నారాయణఖేడ్, మెదక్, జహీరాబాద్ డిపోల్లో 390 బస్సులు ఉన్నాయి. సిద్దిపేట డివిజన్ పరిధిలో సిద్దిపేట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్ డిపోల్లో 275 బస్సులు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం ఎనిమిది డిపోల్లో 665 బస్సులు ప్రతిరోజు తిరుగుతుంటాయి. బతుకమ్మ, దసరా పండుగల దినాల్లో ఆర్టీసీ ఉమ్మడి మెదక్ జిల్లాలో అదనపు సర్వీసులు నడిపింది. సంగారెడ్డి-పటాన్చెరు, సంగారెడ్డి-మెదక్, నారాయణఖేడ్-హైదరాబాద్, జహీరాబాద్-హైదరాబాద్, సిద్దిపేట-హైదరాబాద్, మెదక్-హైదరాబాద్, సంగారెడ్డి-గజ్వేల్ రూట్లలో దసరా పండుగ సందర్భంగా 225 అదనపు సర్వీసులు నడిపింది. ఈ నెల 11వ నుంచి 18వ తేదీ వరకు మెదక్ రీజియన్లోని ఏడు డిపోల పరిధిలో 665 బస్సులు 14.50 లక్షల కిలోమీటర్లు తిప్పారు. మొత్తం 10 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు. దసరా సందర్భంగా వారం రోజులు మెదక్ డిపోలోని 106 బస్సులు 2.30 లక్షల కిలోమీటర్లు తిరగాయి. నారాయణఖేడ్ డిపోలోని 65 బస్సులు 1.50 లక్షలు, సంగారెడ్డి డిపోలోని 116 బస్సులు 2.50 లక్షలు, జహీరాబాద్ డిపోలోని 100 బస్సులు 2.30 లక్షల కిలోమీటర్లు తిప్పారు. సిద్దిపేట డిపోలోని 112 బస్సులు 2.50 లక్షల కిలోమీటర్లు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలోని 74 బస్సులు 1.70 లక్షలు, దుబ్బాక డిపోలోని 35 బస్సులు 80వేల కిలోమీటర్లు, హుస్నాబాద్ డిపోలోని 54 బస్సులు 1.10 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. మొత్తం 665 బస్సులు 14.50 కిలోమీటర్లు మేర తిరిగి 9.50 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. దసరా పండుగ సందర్భంగా ఆక్యుపెన్సీ రేషియో 67.90 శాతంగా నమోదైంది.
దసరా ఆదాయం రూ.4.70 కోట్లు..
ఈ ఏడాది డీజిల్ ధరలు పెరిగినప్పటికీ ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకుండా ఆర్టీసీ పండుగ రోజుల్లో బస్సులు నడిపింది. ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆర్టీసీకి మొత్తం రూ.4.70 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, 18న ఒకే రోజు రూ.1.06 కోట్ల ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. సంగారెడ్డి డిపో అత్యధికంగా రూ.84.50 లక్షల ఆదాయం గడించింది. మెదక్ ఆర్టీసీ డిపోకు రూ.76.40 లక్షలు, నారాయణఖేడ్ డిపోకు రూ.51 లక్షలు, సంగారెడ్డి డిపోకు రూ.84.50 లక్షలు, జహీరాబాద్ డిపోకు రూ.77.70 లక్షల ఆదాయం వచ్చింది. సంగారెడ్డి డివిజన్ పరిధిలో నాలుగు డిపోల్లోని 390 బస్సులు 8.50 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి రూ.2.89 కోట్ల ఆదాయం గడించాయి. సిద్దిపేట డివిజన్లోని సిద్దిపేట డిపో రూ.76.50 లక్షలు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో రూ.50.40 లక్షలు, దుబ్బాక డిపో రూ.21.90 లక్షలు, హుస్నాబాద్ డిపో రూ.32.20 లక్షల ఆదాయం పొందాయి. సిద్దిపేట డివిజన్ పరిధిలోని నాలుగు డిపోలకు చెందిన 275 బస్సులు 6 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి రూ.1.81 కోట్ల ఆదాయం గడించాయి.
నమ్మకం పెరగడంతోనే ఆదాయం : రాజశేఖర్, ఆర్టీసీ ఆర్ఎం
ఆర్టీసీపై ప్రయాణికుల్లో రోజురోజుకూ మరింత నమ్మకం పెరుగుతున్నది. అందువల్లే దసరా పండుగ సందర్భంగా మెదక్ రీజియన్లో ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య కొంత తగ్గింది. కానీ, ఇటీవల కాలంలో మళ్లీ ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరగింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని ప్రయాణికులు విశ్వస్తున్నారు. డ్రైవర్లు, కండక్లర్లు, ఇతర సిబ్బంది మంచి సేవలు అందించారు. వారి పనితీరుతోనే రికార్డుస్థాయిలో ఆదాయం సాధించాం. రాబోయే రోజుల్లో సైతం ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరుతున్నాం.