సికింద్రాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తీలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. ఆయా బస్తీల్లో నీటి సమస్యకు సంబంధించి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో నూతన బోర్లను వేయిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో మంగళవారం బొల్లారం రిసాల బజార్లోని పెన్షన్పురాలో నూతన బోర్వెల్ పనులను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో పెరుగుతున్నజనాభాకు అనుగుణంగా నీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు.
కాగా నీటి సమస్యపై అడిగిన వెంటనే ఎమ్మెల్యే సాయన్న స్పందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ తరుణంలో ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపైనా తనను సంప్రదించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు సీడీపీ నిధుల నుంచి సుమారు రూ.2కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
ఆదే విధంగా ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై త్వరితగతిన పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. వీటితో పాటు దళిత బంధు పథకం కింద నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యామని, రాష్ట్ర సర్కారు అందజేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కంటోన్మెంట్ ప్రజల అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉన్నామని, ఉచిత తాగునీటి పథకాన్ని బోర్డు పరిధిలో త్వరలోనే అమలు చేసే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు లోక్నాథ్, పాండుయాదవ్తో పాటు నేతలు నివేదిత, టీఎన్ శ్రీనివాస్, వేణుగోపాల్రెడ్డి, మురళీయాదవ్, అందె శ్రీనివాస్, ఉమాశంకర్, రవికుమార్, వెంకటేశ్ యాదవ్, శంకర్రావు, లక్ష్మిబాయి, దమయంతి, భాగ్య, రమేశ్, శివ తదితరులు పాల్గొన్నారు.