కొండాపూర్ : నియోజకవర్గ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్ మాదాపూర్ కుమ్మరి బస్తీలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు, విద్యుత్ దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ల సారథ్యంలో అభివృద్ధి శరవేగంగా కొనసాగు తుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఎస్ఆర్డీపీ కింద వేల కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులు పురోభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఫ్లెఓవర్లు, అండర్పాస్లు పూర్తి చేయగా, లింక్ రోడ్లను సైతం అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, డీఈ రమేష్, ఏఈ జగదీశ్, జలమండలి మేనేజర్ నివర్తి, మాజీ కార్పొరేటర్ రంగారావు, నాయకులు శ్రీనివాస్ యాదవ్, రాజు యాదవ్, గంగారం యాదవ్, గ్రామస్తులు శాస్త్రి, ఇంద్రసేన ముదిరాజ్, నర్సింగ్ యాదవ్, కిషన్, నర్సింగ్ ఠాకూర్, గోపాల్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.