మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం జనరల్ దవాఖానలో యూనిట్ను ప్రారంభించి బాధితులతో మాట్లాడారు. త్వరలోనే గుండెకు సంబంధించిన బైపాస్ సర్జరీ వంటి చికిత్సలను అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 26 : కేవలం కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే నిర్వహించే మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స ఇప్పుడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సకు సంబంధించిన యూనిట్ను ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు మహబూబ్నగర్ జిల్లాలో మోకాలు మార్పిడి చికిత్సకు ఇంప్లాంట్స్ లేక పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం సేవలు అందుబాటులోకి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామాలు సందర్శించినప్పుడు ప్రతి గ్రామంలో కనీసం 10మంది మోకాలి నొప్పితో బాధపడేవారు కనిపించేవారని గుర్తుచేశారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి సంబంధించిన ఇంప్లాంట్స్ మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలో వినియోగిస్తారని మంత్రి తెలిపారు. త్వరలోనే మహబూబ్నగర్ పాత కలెక్టరేట్ స్థానంలో రూ.500కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించనున్నామన్నారు. ఇకపై పేదలు వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, అన్ని రకాల చికిత్సలు మహబూబ్నగర్లోనే అందిస్తామన్నారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది ప్రజలకు వైద్యసేవలందించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
త్వరలోనే గుండెకు సంబంధించిన బైపాస్ వంటి చికిత్సలను అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.4కోట్లతో క్యాథ్ల్యాబ్ మంజూరైందన్నారు. ఆర్థో వార్డులో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సకు వచ్చిన బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, ఆస్పత్రి సంఘం సభ్యులు లక్ష్మి, మల్లేశ్, సత్యంయాదవ్, పర్యవేక్షకులు డాక్టర్ రాంకిషన్, డాక్టర్ తులసీరామ్, డాక్టర్ వినోద్, డాక్టర్ జీవన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు, కిషన్ పాల్గొన్నారు.