ఎమ్మెల్యే అబ్రహం
అయిజ, మార్చి 30 : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలో నాటిన ప్రతి మొక్కనూ బతికించాలని ఎమ్మెల్యే అబ్రహం అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంగణంలో పట్టణ ప్రగతి నిధులు రూ. 8.50 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్, ట్యాంకర్ను ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటించారన్నారు. అందుకనుగుణంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మన్న, కమిషనర్ వేణుగోపాల్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థి కుటుంబానికి పరామర్శ ..
ఈతకు వెళ్లి బావిలో పడి మృతిచెందిన విద్యార్థి ఉదయ్కుమార్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అబ్రహం పరామర్శించారు. అంతకుముందు విద్యార్థి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తల్లిదండ్రులు సరోజమ్మ, హన్మంతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అంతకుముందు విద్యార్థి విద్యాభ్యాసం చేస్తున్న కళాశాల సిబ్బంది, స్వేరోస్, ఫిట్ ఇండియా సంస్థల ప్రతినిధులు అంత్యక్రియల ఖర్చు నిమిత్తం రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేశారు.