వీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథి
పాల్గొన్నఅదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్
మహబూబ్నగర్, మార్చి30: జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు ఖాళీలుగా ఉన్న చోట ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథి అన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీల ఎన్నికకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను ఏప్రిల్ 3న ప్రచురించాలని, పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ కేంద్రాలపై నివేదిక సమర్పించాలని తెలిపారు. 6న అన్ని రాజీకయ పార్టీల నేతలతో సమావేశం, 7న ఎంపీడీవో స్థాయిలో మండలంలో సమావేశం నిర్వహించాలని సూచించారు. ముసాయిదా జాబితాపై ఏప్రిల్ నెల 4 నుంచి 8 వరకు అభ్యంతరాలను స్వీకరించి 10నాటికి పరిష్కరించాలని, ఏప్రిల్ 12న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రిని సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పకుండా అమలు చేయాలని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో 5సర్పంచ్, 75వ వార్డు సభ్యులు, 15 ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా, జడ్చర్ల మండలం బండమీదిపల్లి, శంకరాయపల్లి గ్రామాలకు కొత్త గ్రామ పంచాయతీలుగా ఎన్నికలు జరుగనున్నాయని అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవర్ తెలిపారు. వీసీలో జెడ్పీ సీఈవో యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.