ములుగు నుంచే ‘హెల్త్ ప్రొఫైల్’కు శ్రీకారం
పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన జిల్లా.. 90 రోజుల ప్రణాళికతో ఇంటింటా సర్వే
డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం
153 వైద్య బృందాలతో రోజూ 3,060 మందికి వైద్య పరీక్షలు
16 రకాల టెస్టులు చేసి హెల్త్ ప్రొఫైల్ తయారీ
క్లౌడ్ స్టోరేజ్లో సమాచారం నిక్షిప్తం
18ఏళ్లు పైబడిన వారు 2,60,620 మంది ఉన్నట్లు గుర్తింపు
ములుగు, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం కోసం ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్కు శ్రీకారం చుట్టింది. ఇందుకు రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. డిసెంబర్ మొదటి వారం నుంచి ఆయా జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 16 రకాల వైద్య పరీక్షలు చేయించనుంది. చిరునామా, ఆధార్ నంబర్లను నమోదు చేస్తూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి వివరాలను సేకరించి క్లౌడ్ స్టోరేజ్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేయనుంది. ములుగు జిల్లాలో 18ఏళ్లు పైబడిన వారు 2,60,620 మంది ఉన్నట్లు గుర్తించగా, 153 బృందాలు ప్రతి రోజూ 3,060 మంది హెల్త్ ప్రొఫైల్ను 90 పని దినాల్లో పూర్తి చేయనున్నాయి. ఈ సమాచారంతో వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన రిస్క్ అంచనా వేసి, హైరిస్క్ వాళ్లకు అవసరమైన వైద్య సేవలను ప్రభుత్వం అందించనుంది. ఏ వ్యక్తి అయినా దవాఖానకు వెళ్లిన సందర్భంలో, ప్రమాదానికి గురైన క్రమంలో అతడి ఆరోగ్య సమాచారమంతా క్లౌడ్ స్టోరేజ్ నుంచి తెప్పించుకుని వైద్యసేవలందించే అవకాశముంటుంది.
రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధకనబరుస్తున్నది. ఇందుకు ప్రజల ఆరోగ్య పరిస్థితులను పూర్తి వివరాలతో సేకరించి ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల జిల్లాలు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికయ్యాయి. డిసెంబర్ మొదటి వారంలో తొమ్మిది మండలాల్లోని ప్రజల హెల్త్ ప్రొఫైల్ సేకరించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలో 18 ఏండ్లు పైబడిన వారు 2,60,620 మంది ఉన్నట్లు గుర్తించారు. వైద్య బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ప్రతి వారంలో బుధ, శని, ఆదివారాలు సెలువులుగా ప్రకటించారు.
ఇంటింటా తిరుగునున్న వైద్య బృందాలు
జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య ఇప్పటికే భర్తీ చేసి 153 వైద్య బృందాలను సిద్ధం చేశారు. ఒక్కొ బృందంలో ఏఎన్ఎం, ఇద్దరు ఆశా వర్కర్లు ఉండనున్నారు. రెండు బృందాలకు ఒక సూపర్వైజర్ను నియమించి పీహెచ్సీ వైద్యాధికారుల పర్యవేక్షణలో పనిచేసే ఏర్పాట్లు చేశారు. అలాగే మూడు పీహెచ్సీలకు ఒక ప్రోగ్రాం ఆఫీసర్ను సైతం నియమించారు. వీరు డీఎంహెచ్వో పర్యవేక్షణలో పనిచేయనున్నారు. ప్రతి బృందం రోజుకు 20 మంది చొప్పున ఆరోగ్య వివరాలను సేకరించనుండగా 153 బృందాలతో ప్రతిరోజూ 3,060 మంది హెల్త్ ప్రొఫైల్ను సేకరిస్తారు. 90 పనిదినాల్లో జిల్లాలోని 18 ఏండ్లకు పై బడిన వారందరి హెల్త్ ప్రొఫైల్ను సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి పూర్తి సమాచారాన్ని క్లౌడ్ స్టోరేజ్లో నిక్షిప్తం చేయనున్నారు.
16 పరీక్షలతో హెల్త్ ప్రొఫైల్
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 16 రకాల వైద్య పరీక్షలను నిర్వహించి ఆరోగ్య వివరాలను సేకరించాలని నిర్ణయించారు. ఇందులో 12 రకాలైన బరువు, ఎత్తు, బీఎంఐ, హెచ్టీఎన్, ఆర్బీఎస్, హెచ్పీ, బ్లడ్ గ్రూపింగ్, ఆర్ఏటీ, ఆర్డీటీ, డెంగీ, టైఫాయిడ్, యూపీటీ వైద్య పరీక్షలను ఏఎన్ఎంలతో కూడిన వైద్య బృందాలు నిర్వహిస్తాయి. మిగిలిన 4 రకాలైన ఈసీజీ, సీబీపీ, అనాలసిస్, మైక్రోస్కోప్ వంటి పరీక్షలను ల్యాబ్, ఈసీజీ టెక్నిషన్లతో పీహెచ్సీల వారీగా నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు ఒక్కో బృందంలో బీపీ ఆపరేటర్, స్టెతస్స్కోప్, థర్మామీటర్, పల్స్ ఆక్సీమీటర్, గ్లూకోమీటర్ విత్ ట్రిప్స్, వేయింగ్ మిషన్, హైట్స్కేల్, హెచ్బీ మీటర్, డెంగీ కిట్స్, ఆర్డీటీ కిడ్స్, ఆర్ఏటీ కిడ్స్, బ్లెడ్ గ్రూపింగ్ కిడ్స్లతో పాటు టార్చిలైట్లతో కలుపుకుని మొత్తం 13 రకాల వైద్య పరికరాలను సిద్ధం చేసి వైద్య బృందాలకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆరోగ్య స్థితులను తెలుసుకునేందుకే..
హెల్త్ ప్రొఫైల్ సేకరణలో భాగంగా ప్రజల చిరునామా, ఆధార్ నంబర్లను నమోదు చేస్తూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి వివరాలు క్లౌడ్ స్టోరేజ్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేయనున్నారు. దగ్గు, దమ్ము, ఆయాసం, గుండె జబ్బు, థైరాయిడ్, లివర్ జబ్బులు, గతంలో అయిన ఆపరేషన్ల వివరాలు, తలసేమియా, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించి కుటుంబ సభ్యుల ఆరోగ్య స్థితి గతులను అడిగి తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే కుటుంబంలో మానసిక రోగులు, దివ్యాంగుల వివరాలు, టీబీ, కుష్ఠు వ్యాధితో బాధపడే వారి వివరాలు, గర్భిణుల వివరాలు, చిన్నారులకు వచ్చే వ్యాధులు, మంచాన పడి సేవలు పొందుతున్న వారి వివరాలను సైతం సేకరించనున్నారు. ఆపద సమయంలో అవసరమయ్యే రీతిలో హెల్త్ ప్రొఫైల్ను తయారు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.