పక్షులను సంతోషంగా ఎగురనిద్దాం..
జీవ వైవిధ్యాన్ని కాపాడేలా గాలిపటాల పండుగ
సాధారణ దారాన్నే వినియోగించాలంటున్న పర్యావరణ ప్రేమికులు
సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ) ;గాలి వీస్తే ఆకాశంలో పక్షిలా పతంగి చిందులేస్తుంది. అటు ఇటు కదులుతూ వయ్యారాలు పోతుంది. ఆకాశానికి రంగులద్దినట్టు అందంగా ముస్తాబై విభిన్న రంగుల్లో మురిపిస్తాయి. అట్లాంటి పతంగుల సందడి నగరంలో షురూ అయింది. వయేభేదం లేకుండా గాలిపటాలను ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎటు చూసినా ఏ ప్రాంతలో చూసినా పతంగుల వేడుకల ఏర్పాట్లు సాగుతున్నాయి. సంక్రాంతి రోజైతే కొంతమంది కోడిపందాల మాదిరిగా పతంగులు పందాల్లో నిమగ్నమవుతుంటారు. పోటాపోటీగా ఎగురవేస్తుంటారు. అయితే పతంగుల విషయంలో చిన్నపిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉంటుందనినిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేసమయంలో పతంగులను ఎగురవేయద్దని ఎవరూ అనడం లేదు. కానీ.. దానికి వినియోగించే మాంజాలపైనే పక్షి ప్రేమికులు ఆక్షేపణ చెబుతున్నారు. పర్యావరణ హితం కోసం ప్రభుత్వాలు ఇప్పటికే చైనా మాంజాలపై నిషేధం విధించాయి.
అరైజ్ ఫౌండేషన్ను స్థాపించా..
2010 నుంచి 2012 వరకు నెహ్రూ యువ కేంద్రంలో హైదరాబాద్ శాఖలో వలంటీర్గా పనిచేశాను. యువతను చైతన్యం చేసేందుకు 2014లో అరైజ్ ఫౌండేషన్ను స్థాపించా. పదేళ్ల నుంచి విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్లు చెబుతున్నా. యువత, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేశాను. నా సేవలను గుర్తించి 2016న జనవరి 12న యువజన అవార్డుతోపాటు 2017లో అంతర్జాతీయ యువజన కార్యకర్త అవార్డు అందుకున్నాను.-పానుగంటి మహేశ్, ఎమ్మెస్సీ సైకాలజీ, సోషల్ వర్కర్
వీటితోనే ప్రమాదం..
నైలాన్, చైనీస్, గ్లాస్ కోటెడ్ ఉన్న కాటన్ మాంజాలపై నిషేధం కొనసాగుతున్నది. ఎందుకంటే పక్షులు, జంతువులకే కాదు మనుషులకూ తిప్పలు తప్పవని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. పతంగులు ఎగురవేసేందుకు మాంజాను కాకుండా సాధారణ దారాన్నే వినియోగించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.
జీవవైవిధ్యం దెబ్బతినొద్దు..
పావురమైనా.. పాలపిట్టయినా.. రామచిలుకైనా.. అన్ని పక్షులనూ కాపాడితేనే పర్యావరణంతోపాటు జీవవైవిధ్యత ఉట్టిపడుతుంది. అట్లాంటి సమాజాన్ని ప్రజలందరూ కోరుకున్నప్పుడే సుసంపన్నమైన ఆలోచనలతో సమాజం ముందుకు సాగుతుంది. చైనా మాంజానే కాదు పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్ను సైతం నిషేధించాలి. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి.-వేముగంటి రఘురామరావు, పర్యావరణ ప్రేమికుడు