ఖమ్మం ఎడ్యుకేషన్, మే 15: ఇంజినీరింగ్ విద్యలో ఎస్బీఐటీది ప్రత్యేకస్థానమని, రికార్డు స్థాయిలో 225 మంది విద్యార్థులు అత్యున్నత సంస్థల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించడం ఖమ్మానికి గర్వకారణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన సక్సెస్మీట్లో మంత్రి అజయ్కుమార్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.
కేవలం చదువు చెప్పడం వరకే పరిమితం కాకుండా విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు నిర్వహించడం, ప్రాంగణ నియామకాలు చేపట్టి విద్యార్థులను ఉద్యోగులుగా చేయడం అభినందనీయమని అన్నారు. విద్యారంగంలో ప్రత్యేక అనుభవమున్న గుండాల కృష్ణ సారథ్యంలో నడుస్తున్న ఈ సంస్థ మున్ముందు మరింతగా పురోగమించాలని, భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ, కరస్పాండెంట్ డాక్టర్ గుండాల ధాత్రి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, నాయకులు నాగరాజు, మురళి, ప్రశాంతలక్ష్మి, రామ్మోహన్ పాల్గొన్నారు.