జూబ్లీహిల్స్ : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యలో కరాటేను ప్రవేశ పెట్టాలని సినీ నటుడు సుమన్ అన్నారు. కరాటే ఆత్మరక్షణ క్రీడ మాత్రమే కాదని, అది ఆత్మస్థయిర్యాన్ని కల్పిస్తుందని, ఆపదలో ఉన్నప్పుడు మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వీయ రక్షణకు కరాటే దోహదం చేస్తుందని అన్నారు.
సోమవారం యూసుఫ్గూడ కోట్లవిజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ థైక్వాండో అసోసియేషన్ రెండు రోజులపాటు నిర్వహించనున్న 24 వ ఐటిఎఫ్ నేషనల్ థైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ అనూహ్యంగా జరిగే సంఘటనలకు ప్రతిఘటించి తమతో పాటు ఇతరులకు కూడా రక్షణ కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. ఆపదలో ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూసే సమయముండదని, ఆత్మరక్షణ క్రీడలలో ప్రవేశమున్న వారు దేహమే ఆయుధంగా దాడికి ప్రతిదాడి చేసే సామర్ధ్యాన్ని పొందుతారన్నారు.
కరాటే మహావృక్షంలో శాఖలుగా ఉన్న థైక్వాండో వంటి క్రీడలను తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు సూచనలు చేస్తూ వారిలోని ప్రతిభను వెలికితీస్తున్న థైక్వాండో అసోసియేషన్ను అభినందించారు.
అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వి.మారుతి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కన్వీనర్ సుబ్బారావు, అధ్యక్షులు డాక్టర్ జయరామ్ రెడ్డి, రిటైర్డ్ అడిషనల్ ఎస్పి రాజీవ్ కుమార్, క్యాపిటల్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్లు హరీష్ రెడ్డి, రాహుల్ బూసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.