లింగంపేట, జనవరి 16 : మండలంలోని పర్మళ్ల గ్రామంలో పర్మళ్ల గ్రామ యూత్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి కబడ్డీ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఫైనల్లో నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం, రాంపల్లి జట్లు తలపడ్డాయి. రాంపల్లి గ్రామ జట్టు విజేతగా నిలించింది. గెలుపొందిన జట్లకు పర్మళ్ల సర్పంచ్ పర్వయ్య బహుమతులను ప్రదానం చేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 7 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన బొల్లారం గ్రామ జట్టుకు రూ. 5 వేలు అందజేశారు. కార్యక్రమంలో రాంపల్లి తండా సర్పంచ్ పరశురాం, విండో డైరెక్టర్ సిద్ధిరాములు, పర్మళ్ల గ్రామ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ముస్తాపూర్లో వాలీబాల్ పోటీలు..
లింగంపేట మండలంలోని ముస్తాపూర్ గ్రామంలో మూడు రోజుల పాటు నిర్వహించిన వాలీబాల్ పోటీలు శనివారంతో ముగిశాయి. ప్రథమ బహుమతి బాణాపూర్ జట్టు, ద్వితీయ బహుమతి తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ గ్రామ జట్టు దక్కించుకున్నాయి. ఈ పోటీలకు టీపీసీసీ సెల్ ఐటీ కన్వీనర్ మదన్మోహన్ హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ప్రథమస్థానంలో నిలిచిన జట్టుకు రూ. 8 వేలు, ద్వితీయస్థానంలో నిలిచిన జట్టుకు రూ. 5 వేలు అందజేశారు. కార్యక్రమంలో లింగంపేట, గాంధారి, తాడ్వాయి, సదాశివనగర్ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షరీఫ్, తూర్పు రాజు, రాజేశ్వర్రెడ్డి, లింగాగౌడ్తోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యువకులకు క్రీడాపోటీలు
తాడ్వాయి, జనవరి 16 : మండల పరిధిలోని పలు గ్రామాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువకులకు క్రీడాపోటీలను నిర్వహించారు. తాడ్వాయి, బ్రాహ్మణ్పల్లి, కరాడ్పల్లి, సంతాయిపేట, చిట్యాల, కన్కల్ గ్రామాల్లో వాలీబాల్, కబడ్డీ, క్యారం, చెస్, క్రికెట్ పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పెద్దలు బహుమతులను ప్రదానం చేశారు.