నిజామాబాద్ నగరంలో ఐటీ టవర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లు ప్రారంభమై సేవలు అందిస్తుండగా… అదే బాటలో నిజామాబాద్ ఐటీ టవర్ సైతం త్వరలోనే అందుబాటులోకి రానున్నది. భవన నిర్మాణ పనులు పూర్తి కాగా తుది మెరుగులు అద్దుకుంటున్నది. ఐటీ టవర్ను ఉగాదిలోపు ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంపీగా ఉన్నప్పుడే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నగరంలోని నూతన కలెక్టరేట్ ప్రాంతంలో ఐటీ హబ్కు మూడున్నర ఎకరాల భూమిని కేటాయించారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. తుది మెరుగులకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయానికి పక్కనే బైపాస్ రోడ్డును ఆనుకుని ఐటీ టవర్ను నిర్మిస్తున్నారు. ఐటీ టవర్ నిర్మాణాన్ని ప్రతి దశలోనూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం నిరంతరం సమీక్షిస్తున్నారు.
నిజామాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పట్టణీకరణలో భాగంగా గడిచిన పదేండ్లలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సమూల మా ర్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు అసౌకర్యాలతో కొట్టుమిట్టాడే ప్రాంతం ఇప్పుడు హైదరాబాద్కు దీటుగా రూపాంతరం చెందుతున్నది. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు నేతృత్వంలో పట్టణాభివృద్ధి విశేషంగా పుంజుకుంటున్నది. అభివృద్ధిలో నిజామాబాద్ నగరం రాకెట్ వేగంతో దూసుకుపోతుండగా… అదనపు హంగులతో కొంగొత్తగా మారుతున్నది. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా చొరవతో నిజామాబాద్ నగరంలో ఐటీ టవర్ ఏర్పాటైంది. స్థానిక యువతకు స్థానికంగానే ఐటీ రంగంలో ఉద్యోగాలు దక్కే విధంగా ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లు ప్రారంభమై సేవలు అందిస్తుండగా… అదే బాటలో నిజామాబాద్ ఐటీ టవర్ సైతం త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే భవన నిర్మాణ పనులు పూర్తి కాగా… తుది మెరుగులు అద్దుకుంటున్నది.
ఉగాదిలోపు ప్రారంభోత్సవం !
నిజామాబాద్ జిల్లాలోని ఐటీ టవర్ను ఉగాదిలోపు ప్రారంభించుకునే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. శుక్రవారం నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన జిల్లా వాసుల్లో ఉత్సాహాన్ని నింపింది. స్వయంగా కేటీఆరే ప్రకటన చేయడంతో కొద్ది రోజుల్లోనే ఐటీ టవర్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. తుది మెరుగులకు సంబంధించిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయానికి పక్కనే బైపాస్ రోడ్డుకు ఆనుకుని నిర్మించిన ఐటీ టవర్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. అత్యాధునిక పద్ధతుల్లో ఐటీ కంపెనీలకు అనువైన వాతావరణం ఉండే విధంగా నిర్మాణాలను చేపడుతున్నారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ప్రకారం తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ వెలుతురును సహజ సిద్ధంగానే పొందే విధంగా నిర్మాణాలను చేపడుతున్నారు. ఐటీ టవర్ నిర్మాణాన్ని ప్రతి దశలోనూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం నిరంతరం సమీక్షిస్తున్నారు.
తరలిరానున్న ఐటీ కంపెనీలు
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఐటీ కంపెనీలు తమ వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. అంతర్జాతీయ కంపెనీలకు దేశంలో హైదరాబాద్ మాత్రమే అనువైన ప్రాంతంగా మారుతుండడంతో మన రాజధాని ఐ టీ హబ్గా వెలుగులీనుతోంది. తరలివస్తున్న భారీ పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఇతర జిల్లాలకు తరలిస్తోంది. మెట్రో నగరమైన హైదరాబాద్లోనే ఐటీ వ్యవస్థీకృతం అవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ కంపెనీలను తీసుకువస్తున్నారు. ఇందుకోసం మంత్రి కేటీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మిస్తున్న ఐటీ టవర్ నిజామాబాద్ జిల్లాలోనూ కొద్ది కాలంలోనే ప్రారంభం కాబోతున్న వేళ దాదాపు 15 నుంచి 20 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంపీగా ఉన్నప్పుడే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నగరంలోని నూతన కలెక్టరేట్ ప్రాంతంలో ఐటీ హబ్కు మూడున్నర ఎకరాల భూమిని కేటాయించారు. సువిశాల ప్రాంతంలో ఈ ఐటీ భవనాన్ని నిర్మించేలా ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనతికాలంలోనే ఐటీ టవర్ పూర్తయ్యే విధంగా పాటుపడ్డారు.
ఐటీ టవర్ విశేషాలివీ…
నిజామాబాద్లోని ఐటీ టవర్ను భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో నిర్మిస్తున్నారు. రోజురోజుకూ నగరం విస్తరిస్తున్న వేళ ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ విస్తరణకు స్థల సమస్య ఎదురు కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. గిరిరాజ్ కళాశాల సమీపంలో బైపాస్ రోడ్డులో నూతన కలెక్టరేట్ పక్కనే 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐటీ టవర్కు కేటాయించారు. పరిపాలన భవనం కలెక్టరేట్ ఈ ప్రాంతంలోనే నిర్మించడం, ఇతరత్రా ముఖ్యమైన భవన నిర్మాణాలు ఇక్కడ జరుగుతుండడంతో ఐటీ టవర్ను సైతం ఇక్కడే నెలకొల్పారు. నిజామాబాద్ నగరాభివృద్ధిని అంచనా వేసుకుని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. రూ.25కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడంతో 2018, ఆగస్టు 1వ తారీఖు రోజున భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐటీ టవర్ను సువిశాలంగా నిర్మిస్తున్నారు. మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాన్ని చేపడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని మూడు అంతస్తులతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎకరం భూమిలో ఐటీ టవర్ను డిజైన్ చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్ను విస్తరించాలనుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం పార్కింగ్, లాన్, ఇతర సౌకర్యాల కల్పనకు ఈ ఖాళీ భూమిని వాడుకోనున్నారు.
తుది దశకు ఐటీ టవర్ పనులు
నిజామాబాద్ నగరంలోని ఐటీ టవర్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. భవన నిర్మాణం వంద శాతం పూర్తయ్యింది. మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్లో ఐటీ టవర్లను ప్రభుత్వం ప్రారంభించింది. త్వరలోనే నిజామాబాద్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రధాన రహదారి పక్కనే నిజామాబాద్ ఐటీ టవర్ ఉండడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది.