ఆర్టీసీ అంటేనే నష్టాల బాట అనే మాటను చెరిపేస్తూ.. లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త కొత్త ఆలోచనలతో సంస్థను అభివృద్ధి బాట పట్టించేందుకు అడుగులు పడుతున్నాయి. టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ సంస్థ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు. సంస్థ ఆదాయాన్ని మరింత పెంచేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిరుపయోగంగా ఉన్నఆర్టీసీ స్థలాలను వినియోగించుకునేందుకు నిర్ణయించారు. పెట్రోల్ బంక్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, పార్కింగ్ స్టాల్స్, కల్యాణ మండపాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు.
ఆర్టీసీ.. ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు ఎర్రబస్సు.. ఇప్పుడు పచ్చబస్సు.. అప్పటికి ఇప్పటికీ బస్సుల కలర్లు మారాయే తప్ప.. సంస్థ అభివృద్ధి బాటలోకి పయనించలేకపోయింది. అయితే ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అధికారులు, పాలకులు మారారు. కొత్త కొత్త ఆలోచనలతో సంస్థను అభివృద్ధి బాట పట్టించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగాగానే కొంతకాలంగా ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యలను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయం పెంచేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇటీవలే ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న నిజామాబాద్ రూరల్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీగా నియామకమైన సజ్జనార్ సంస్థ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే పార్సిల్, కార్గో బస్సులను ప్రవేశపెట్టి ఆదాయం పెంచుతున్నారు. వివాహాలు, శబరిమల వంటి యాత్రలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించి సంస్థ ఆదాయం పెంచుకునేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంక్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, పార్కింగ్ స్టాల్స్, కల్యాణ మండపాలను ఏర్పాటు చేసేందుకు సంస్థ ఉన్నతాధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగి పూర్వ వైభవం రానున్నదని అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికే కార్గో, పార్సిల్ సేవలు మంచి ఫలితా లు ఇవ్వడంతో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్లు, పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేయడం ద్వారా మరింత ఆదాయం ఆర్జించవచ్చనే ఆలోచనలతో ఇటు ప్రభుత్వం, అటు సంస్థ అధికారులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఆర్టీసీ అంటే నష్టాల్లో కొట్టుమిట్ట్టాడుతూ ఉంటుందని అందరూ అనుకుంటుంటారు. ఈ నష్టాలను పూడ్చి లాభాల బాటలో ఆర్టీసీ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు నూతన ఆలోచనలకు పదును పెట్టారు.
ఇదీ ఉమ్మడి జిల్లా పరిస్థితి…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఆరు ప్రధాన బస్సు డిపోలు ఉన్నాయి. నిజామాబాద్-1, 2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. భీమ్గల్ బస్సు డిపో కూడా కొన్ని సంవత్సరాలు కొనసాగింది. అయితే ఆదాయం లేక దానిని మూసివేశారు. వీటికితోడు గతంలో నందిపేట, ఎల్లారెడ్డి, నిజామాబాద్ సిటీ డిపోలు మంజూరు అయ్యాయని, అవి ప్రారంభమైతే ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రయాణికులకు మరిన్ని సౌకరర్యాలు అందుబాటులోకి వస్తాయని అందరూ భావించారు. అయితే అది కార్యరూపం దాల్చలేకపోయింది. ఆ విషయం అటుంచితే ప్రస్తుతం ఉన్న డిపోల పరిధిలో గల బస్టాండ్ల స్థలాలను ఇప్పటికే అధికారులు పరిశీలించారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో లాభాలు వచ్చే విధంగా షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్లు, కల్యాణ మండపాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. వినోదం కోసం మల్టీప్లెక్స్ సినిమా హాళ్లను కూడా ఏర్పా టు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు కూడా చేస్తున్నారు.
కరోనాతో కోలుకోలేని దెబ్బ..!
కరోనా రక్కసి అన్ని వ్యవస్థలపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. అందుకు టీఎస్ ఆర్టీసీ కూడా అతీతమేమి కాదు. కరోనా కారణంగా సుమారు ఎనిమిది నెలల కాలంపాటు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకుండా ఉండిపోయాయి. ఫలితంగా ఉద్యోగుల జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. అయితే రాష్ర్ట ప్రభుత్వం మాత్రం ప్రజల మేలు కోరి సంస్థను కాపాడేందుకు చర్యలు చేపట్టింది. ఇక ప్రస్తుతం ఆర్టీసీ సంస్థ ఆదాయం పెంచేందుకు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ నూతన ఆలోచనలకు పదును పెడుతున్నారు. వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టారు. కార్గో సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతోపాటు పార్సిల్ సేవలు కూడా నిరంతరాయంగా కొనసాగుతుండడంతో ప్రజలు సేవలపై ఆసక్తి చూపుతున్నారు.
ఆదాయం పెంచడమే లక్ష్యం
ఏండ్లుగా ఆర్టీసీ నష్టాల బాటలోనే కొనసాగిన విషయం అందరికీ తెలుసు. స్వరాష్ట్రం సిద్ధించడం, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థ బలోపేతానికి అడుగులు పడుతున్నాయి. నన్ను ఆర్టీసీ చైర్మన్గా నియమించినందుకు సంతోషంగా ఉన్నది. పదవికి పూర్తి న్యాయం చేస్తా. సంస్థను నష్టాల బారి నుంచి గట్టెక్కించేందుకు అవసరమైన చర్యల గురించి ఆలోచనలు చేస్తున్నాం. సంస్థకు ఆదాయ మార్గాలు అన్వేషించి విజయవంతంగా నడిపించడమే లక్ష్యం.
-బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే
నివేదికలను అధికారులకు అందించాం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్టీసీకి చెందిన స్థలాల్లో ఫంక్షన్ హాళ్లు, వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయడం ద్వారా సంస్థకు ఆదాయం చేకూరనున్నది. ఉన్నతాధికారుల సూచన మేరకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో తెలుసుకుంటాం. వారి ఆదేశాల ప్రకారం అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే చాలా స్థలాలను పరిశీలించాం. వాటికి సంబంధించిన నివేదికలను ఉన్నతాధికారులకు కూడా అందించాం.
-సుధాపరిమళ, ఆర్ఎం, నిజామాబాద్