కొండాపూర్ : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
సూర్యపేట తిరుమలగిరిలో మరణించిన మేనబావ అంత్యక్రియలకు వెళ్తున్న క్రమంలో పాపిరెడ్డి కాలనీకి చెందిన జెన్న శేఖర్రెడ్డి (67), భార్య ధనమ్మ(60), కుమారుడు రఘుమారెడ్డి(27)లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శేఖర్ రెడ్డి మేనబావ నరసింహారెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం కారులో మొదటి భార్య, కుమారుడితో కలిసి సూర్యపేట జిల్లా తిరుమలగిరికి బయలుదేరారు.
మార్గమధ్యలో జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం సూర్యపేట ప్రధాన రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు వెనక టైర్ పగిలిపోవడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో శేఖర్రెడ్డి, ధనమ్మ, రఘుమారెడ్డిలు అక్కడిక్కడే మృతి చెందారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో పాపిరెడ్డి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీటీపర్యంతమయ్యారు. కాగా రఘుమారెడ్డికి 2020 నవంబర్ 18న మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేట పేట వంతడుపుల గ్రామానికి చెందిన దివ్యతో వివాహం జరిగింది. రఘుమారెడ్డి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హోటల్లో హెచ్ఆర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు.