ధారూరు/పూడూరు, జనవరి16: ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులోని నీటిలో ఆటాడుతూ నలుగురు గల్లంతు అయి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన బైకాని లోకేశ్(28), బైకాని వెంకటేశ్(25), బైకాని జగదీశ్(24), ఆవుదొడ్డి రాజేశ్(24) లు వారి కుటుంబ సభ్యులతో కలిసి మొత్తం12 మంది కారు, అటోలో సోమవారం ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టుకు వచ్చారు. ప్రాజెక్టు నీటిలో ఆడుతూ గంటకు పైగా సరదాగా నీటిలో గడిపారు. నీటిలో ఆడుతూ తిరిగి వస్తున్న క్రమంలో ఇద్దరూ రాజేశ్, వెంకటేశ్లకు దమ్మురావడంతో నీటిలో మునుగుతున్నారని, ఈత వచ్చిన ఇద్దరు జగదీశ్, లోకేశ్లు రక్షించే ప్రయత్నం చేశారు. అక్కడ లోతు ప్రదేశం, బురదమట్టి ఉండడంతో వారి ప్రయత్నం విఫలం కావడంతో వారు కూడా బురదలో చిక్కు కున్నారు. గమనించిన మరో వ్యక్తి కళ్యాణ్ స్థానికులకు తెలిపి గల్లంతైన వారిని స్థానికుల సహాయంతో బయటకు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ధారూరు పోలీసులు మృత దేహలను వికారాబాద్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై ఎంపీ రంజిత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ విచారం వ్యక్తం చేశారు.
ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టు దగ్గర జరిగిన ఘటనపై మ్ంర సబితారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చెశారు. మన్నెగూడ ప్రాంతానికి చెందిన వారు విహార యాత్ర విషాదంగా మారటం ఎంతో బాధ కలిగించిందని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటన తెలిసిన వెంటనే వారి ఆచూకి కోసం గాలించాలని పోలీసులకు ఆదేశించినట్లు తెలిపారు. వికారాబాద్, పరిగి, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్, ఎస్పీ, లతో మంత్రి మాట్లాడారు.
నలుగురి మృతితో మన్నెగూడలో విషాదఛాయలు అలముకున్నాయి. బైకని లోకేష్ హైదరాబాద్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుండగా, బైకని వెంకటేష్ హైదరాబాద్లోనే ఎస్సై కోచింగ్ తీసుకుంటున్నాడున ఆవుదొడ్డి రాజేష్ హైదరాబాద్లో ఇంటర్ చదువుతుండగా, బైకని జగదీష్ మన్నెగూడ గ్రామంలో ప్లంబర్గా పనిచేస్తున్నాడు. సంక్రాంత్రి పండుగకు హైదరాబాద్లో ఉన్నవారు మన్నెగూడ గ్రామానికి రావడంతో సరదాగా 15 మంది కుటుంబ సభ్యులతో కలిసి కోట్పల్లి ప్రాజెక్టుకు వెళ్లారు. అందులో లోకేష్,వెంకటేష్, జగదీష్, రాజేష్లతో పాటు కల్యాణ్లు ఈత కొడుతు ప్రమాదవశత్తు నలుగురు మృతి చెందగా కల్యాణ్ బయటపడ్డారు. లోకేశ్, వెంకటేశ్ల తల్లిదండ్రులు గతంలో మృతి చెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలోని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.