బండ్లగూడ : విదేశాల నుంచి చదువు, వ్యాపార నిమిత్తం నగరానికి వచ్చే వారికి గదులు అద్దెకు ఇచ్చే సమయంలో ఇంటి యజమానులు తప్పనిసరిగా సీ ఫారం తీసుకోవాలని, అదే విధంగా వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేయాలని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ, సన్సిటీ, పీఅండ్టీ కాలనీ ప్రాంతాలలో డీసీపీ ప్రకాశ్రెడ్డి పర్యవేక్షణలో పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డెన్ సెర్చ్లో వీసా గడువు ముగిసినా వివిధ కారణాలతో నివాసముంటున్న వివిధ దేశాలకు చెందిన 40 మందిని అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్బంగా డీసీపీ ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ విదేశీయులకు గదులు అద్దెకు ఇచ్చినప్పుడు సీ-ఫారం తీసుకోక పోతే వారు ఏదైనా నేరానికి పాల్పడితే ఇంటి యజమానిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. ఎవరైనా విదేశీయులు ఎక్కువ రోజులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, ఐదు మంది ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది ఇంటింటా తనిఖీలు చేశారు.