నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 16 : జిల్లావ్యాప్తంగా సంక్రాంతి, కనుమ వేడుకలను ప్రజలు శని, ఆదివారాల్లో సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. వాకిళ్లలో మహిళలు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులను వేశారు. ముగ్గుల మధ్య గొబ్బెమ్మలను ఉంచి పూజలు చేశారు. మహిళలు ఇండ్లల్లో పాలు పొంగించి ప్రత్యేకపూజలు చేశారు. నోములు నోచుకున్నారు. పిల్లలు, పెద్దలు గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేశారు.
బిచ్కుంద మండలంలోని పలు గ్రామాల్లో రైతులు తమ పంట పొలాల్లో శనివారం లక్ష్మీమాత చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. పంట దిగుబడి బాగా రావాలని కోరుకున్నారు. అనంతరం బంధువులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. బిచ్కుంద గ్రామ ప్రజలు కనుమ పండుగను ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. బిచ్కుంద మండలకేంద్రంలోని ఓ ఇంటి ఎదుట మహిళలు ‘జై కేసీఆర్, జై హన్మంత్ అని వేసిన ముగ్గు ఆకట్టుకున్నది.
ఎల్లారెడ్డిలో బసవన్నలు ఇంటింటికీ వెళ్లగా.. మహిళలు కానుకలు అందజేసి సంప్రదాయాన్ని చాటి చెప్పారు. పండుగ సందర్భంగా మటన్, చికెన్ మార్కెట్లు కిటకిటలాడాయి. మటన్ కిలో రూ. 640 చికెన్ కిలో రూ. 200, నాటుకోళ్ల అమ్మకాలు రూ. 400 నుంచి వెయ్యి రూపాయల వరకు కొనసాగాయి. పతంగులు, స్వీట్ దుకాణాల వద్ద ప్రజల రద్దీ కనిపించింది. మహిళలు ఇంటింటికికీ వెళ్లి నోములు నోచుకున్నారు. ఒకరికొకరు నువ్వులు, చక్కరి తినిపించుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో పూజారి ముత్యాల శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో మాలధారులు పడిపూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
గాంధారి మండలకేంద్రంలోని భోగేశ్వరాలయంతో పాటు పొతంగల్ సమీపంలోని బుగ్గరామేశ్వరాలయం, పేట్సంగెంలోని సంగమేశ్వరాలయం, గుడిమెట్ సమీపంలోని మహాదేవుని గుట్ట, గౌరారంలోని శ్రీరామాంజనేయుని ఆలయాలు పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి.
పిట్లం మండలకేంద్రంలోని మహిళలు నోములను ఇచ్చిపుచ్చుకున్నారు. డప్పువాయిద్యాల నడుమ 108 ఇండ్లకు తిరిగారు. అనంతరం స్థానిక అయ్యప్పఆలయంలో పూజలు చేసి నోములను ఇచ్చిపుచ్చుకున్నారు. గ్రామప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, పంటలు బాగా పండాలని నోములు చెల్లించుకున్నట్లు మహిళలు తెలిపారు.
బాన్సువాడ పట్టణంలో పలు ఇండ్ల ఎదుట ముగ్గులతోపాటు కారుగుర్తులు, రైతుబంధు పథకం వివరాలను తెలిపే విధంగా ముగ్గులు వేశారు. బాన్సువాడ మండలంలోని కొల్లూర్ గ్రామంలో ఎంపీపీ దొడ్ల నీరజ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆమె బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, జనార్దన్రెడ్డి, దుర్గారెడ్డి, శోభ, బర్ల అశోక్, సంతోష్చారి, నాందేవ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీల్లో ఇండ్ల ఎదుట మహిళలు పోటాపోటీగా రంగురంగుల ముగ్గులు వేశారు. గొబ్బెమ్మలు, నవధాన్యాలు, చెరుకు గడలు, జీడి, రేగుపండ్లు, పిడకలను పేర్చి పాలు పొంగించారు. సాయంత్రం వేళ ఆడపడుచులు నోములు నోచుకున్నారు.