దివ్యాంగులు ఎవరికీ తీసిపోకుండా అన్ని రంగాల్లోనూ రాణించాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చి వారిలో మనోధైర్యం నింపిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రూ.69 లక్షల వ్యయంతో శనివారం సూర్యాపేటలో దివ్యాంగులకు 34 త్రీ వీలర్ స్కూటీలు, 11 ల్యాప్ టాప్లు, 10 స్మార్ట్ ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. ఎవరూ అడుగకపోయినా ఆర్థిక భరోసా కల్పించేందుకు పింఛన్ను 3,116 రూపాయలకు పెంచడం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు నిదర్శనమని తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి విభిన్న రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ పాల్గొన్నారు.
సూర్యాపేట, జనవరి 22(నమస్తేతెలంగాణ) : దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించేందుకు, ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగు పర్చి, మనోధైర్యాన్ని నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటీలు, ట్రై సైకిళ్లు, ల్యాప్టాప్తోపాటు 4జీ ఫోన్లను సూర్యాపేటలో మంత్రి తన క్యాంపు కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. రూ. 69 లక్షలతో అందజేస్తున్న 34 మూడు చక్రాల వాహనాలు, 11 ల్యాప్టాప్లు, 10 సెల్ఫోన్లను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలిచి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నదన్నారు. అంగవైకల్యం ఉన్నదని బాధపడకుండా ఎంతో మంది దివ్యాంగులు ఉన్నత విద్యను అభ్యసించి అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబీమా, రైతుబంధు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. రైతుబంధుతో రూ.15వేల కోట్లు రైతాంగానికి అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు. సాలీనా రూ.3వేల కోట్ల ప్రీమియంతో దేశంలోనే మొట్ట మొదటిసారిగా సహజ మరణాలకు కూడా బీమా వర్తించేలా రైతుబీమా ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ, లబ్ధిదారులు పాల్గొన్నారు.