బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ కో అపరేటివ్ హౌజ్ బిల్డిండ్ సొసైటీ కార్యదర్శిగా ఏ.మురళీ ముకుంద్ను కొనసాగించాల్సిందే అని తెలంగాణ కో ఆపరేటివ్ ట్రిబ్యునల్ గురువారం తీర్పును వెలువరించింది. దీంతో గత కొన్ని నెలలుగా జూబ్లీహిల్స్ సొసైటీలో తలెత్తిన వివాదానికి తెరపడినట్లయింది.
ఆరునెలల క్రితం జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రవీంద్రనాథ్ ప్యానెల్లో విభేదాలు తలెత్తాయి. సొసైటీ కార్యదర్శి మురళీముకుంద్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన మేనేజింగ్ కమిటీ ఆయనను పదవినుంచి తొలగిం చింది. అయితే మేనేజింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్యదర్శి మురళీముకుంద్ కో అపరేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు.
సహకార చట్టం నిభందనల ప్రకారం సొసైటీ కార్యదర్శిపై అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం లేనందున మురళీముకుంద్ను తిరిగి నియమిస్తూ గురువారం తీర్పును వెలువరించింది. సొసైటీ సభ్యుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే తనపై అవిశ్వాసం ప్రవేశపెట్టారని, ట్రిబ్యునల్ తీర్పుతో తనకు న్యాయం జరిగిందని మురళీ ముకుంద్ తెలిపారు. సభ్యులందరితో కలిసి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.