కార్గో ద్వారా ఇంటింటికీ చేరుస్తున్న ఆర్టీసీ 18 ప్రత్యేక బృందాల ద్వారా ప్రచారం రూ.80 చొప్పున బుకింగ్.. 4,370 రిజిస్ట్రేషన్స్ ఈ నెల 9 వరకు చాన్స్.. 11 నుంచి అందజేత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనూహ్య స్పందన రాష్ట్రంలోనే ఆదిలాబాద్ రీజియన్ టాప్ నిర్మల్ టౌన్, ఏప్రిల్ 5 : ఆర్టీసీ వినూత్న పథకాలతో దూసుకెళ్తున్నది. ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రయాణికులను ఆకర్షించే విధంగా పలు పథకాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 10వ తేదీన భద్రాద్రి కొత్తగూడెంలో రాములోరి కల్యాణోత్సవం ఉండగా.. గత నెల 28 నుంచి తలంబ్రాల బుకింగ్కు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ రీజియన్లో ఆరు డిపోలు ఉండగా.. 18 బృందాలు ఏర్పాటు చేసి దుకాణాలు, బస్టాండ్లు, దేవాలయాలు, విద్యాసంస్థల్లో ప్రచారం చేయిస్తున్నారు. రూ.80తో బుకింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆదిలాబాద్ రీజియన్లో ఇప్పటివరకు 4,376 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇందులో ఆదిలాబాద్లో 1081, భైంసాలో 360, నిర్మల్లో 855, ఉట్నూర్లో 250, ఆసిఫాబాద్లో 770, మంచిర్యాలలో 1060 చొప్పున రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. బుకింగ్లో ఆదిలాబాద్ రీజియన్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ నెల 9 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండగా.. బుకింగ్స్ను 10 వేలు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి పూర్తయితే ఆర్టీసీకి రూ.8 లక్షల ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఆదరణ పెరిగింది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కార్గో సేవల ద్వారా సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు ప్రజల నుంచి అనూహ్యస్పందన లభిస్తు న్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 18 ప్రత్యేక బృందాలు కల్యాణోత్సవ తలంబ్రాల బుకింగ్ నిర్వహిస్తుండగా.. ఇప్పటివరకు 4,376 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు తెలిపారు. వీరందరికీ ఏప్రిల్ 11 తర్వాత నేరుగా ముత్యాల తలంబ్రాలను ఇంటికి వెళ్లి అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. - సుధా పరిమాల, ఆర్ఎం, ఆదిలాబాద్ రాముని ఆశీర్వాదం కోసమే బుకింగ్ చేశా.. మాకు చిన్నప్పటి నుంచి సీతారాము లవారంటే ఎంతో ఇష్టం. కరోనా రావడం వల్ల కల్యాణోత్సవానికి వెళ్లలేకపోయాం. ఈనెల 10న భద్రాద్రిలో సీతారాముల కల్యాణ్సోవం ఉండగా.. వెళ్లడానికి వీలుకావడం లేదు. ఆర్టీసీకి రూ.80 చెల్లించి ముత్యాల తలంబ్రాల బుకింగ్ చేశాం. ఖమ్మం వెళ్లిరావాలంటే రూ. 1000 బస్సు చార్జీలు అవుతాయి. ఇప్పుడు రూ.80తోనే తలంబ్రాలు మా ఇంటికి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. -అనురాధ, ప్రయాణికురాలు, నిర్మల్ ప్రయాణికులకు ఆర్టీసీ భరోసా.. ప్రయాణికుల సేవే ప్రథమ కర్తవ్యంగా భావించే ఆర్టీసీ ప్రయాణికుల రవాణా భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తు న్నది. ఎండీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలు, గర్భిణులకు ఉచిత ప్రయాణం, 60 ఏళ్లు నిండిన వారికి ఉగాది పర్వదినాన ఉచిత ప్రయాణం వంటి సౌకర్యం కల్పించారు. ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. -సాయన్న, నిర్మల్ ఆర్టీసీ డీఎం