కాచిగూడ : మాయమాటలతో ఓ యువకుడు మైనర్ బాలికను బెదిరించి రూ.40 వేల రూపాయలను వసూలు చేశాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడ డివిజన్కు చెందిన మైనర్ బాలిక దసరా పండుగ రోజు దూద్బౌలిలో ఉండే అత్తమ్మ ఇంటికి వెళ్లింది.
అక్కడే హర్షవర్ధన్ అనే యువకుడు బాలికకు పరిచయమయ్యాడు. ఆ సమయంలో హర్షవర్ధన్ ఆ బాలిక ఫోటోలు తీసుకున్నాడు. అప్పటి నుంచి డబ్బులు కావాలని లేని పక్షంలో ఫోటోలు ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రాంలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఆతని మాటలకు బయపడి బాలిక రూ.40 వేలు ఇచ్చింది.
తరుచుగా అమ్మాయి చదివే స్కూల్ దగ్గరకు వెళ్లి మరిన్ని డబ్బులు కావాలని బెదిరించాడు. పలు మార్లు నచ్చచెప్పిన ఆతనిలో మార్పురాలేదు. దీంతో గురువారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హర్షవర్ధన్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.