బంజారాహిల్స్ : నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వెస్ట్జోన్ జాయింట్ కమిషనర్ ఏఆర్.శ్రీనివాస్ హెచ్చరించారు. వెస్ట్జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పబ్స్ నిర్వాహకులతో గురువారం జాయింట్ కమిషనర్ సమావేశం నిర్వహించారు.
డిసెంబర్ 31న తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. పబ్స్ వద్ద ఖచ్చితంగా అదనంగా డ్రైవర్లను అందుబాటు లో ఉంచుకోవాలని, మద్యం సేవించిన వారు వాహనాలు నడపకుండా చూసుకోవాలని సూచించారు. పబ్స్లో మద్యం తాగడంతో పాటు కార్లలో మద్యం బాటిళ్లు పెట్టుకుని రోడ్లమీదకు వస్తుంటారని, అలాంటి వారికి మద్యం సరఫరా చేయవద్దని సూచించారు.
సమయపాలన పాటించాలని, భారీ శబ్ధాలతో న్యూసెన్స్కు పాల్పడే పబ్స్పై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పబ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా తగినంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
హద్దు మీరితే ఉపేక్షించవద్దు..
న్యూఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం మత్తులో యువతీయువకులు రోడ్లపైన హద్దుమీరి ప్రవర్తిస్తే ఉపేక్షించవద్దని జాయింట్ సీపీ ఏఆర్.శ్రీనివాస్ సంబంధిత ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. పబ్స్ వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలని యువతులపట్ల అసభ్యంగా ప్రవర్తించేవారిని గుర్తించి అదుపులోకి తీసుకోవాలని సూచించారు.
రోడ్లపై వెళ్లేవారిని వేధించే పోకిరీలపై కఠినచర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఎక్కడిక్కడ డ్రంక్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని, ప్రధాన రోడ్లపై మితిమీరిన వేగంతో వెళ్లేవారిని నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్ర, పంజాగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.