కరోనా మహమ్మారి వ్యాప్తిని ఆదిలోనే అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో శుక్రవారం నుంచి జ్వర సర్వే ప్రారంభమైంది. సర్వే బృందాలు వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారిని ఇండ్ల వద్దే గుర్తించి వారికి హోం ఐసొలేషన్ కిట్లను అందజేయడంతోపాటు వైరస్వ్యాప్తి చెందకుండా చర్యలను ప్రారంభించాయి. ఇంటింటి జ్వరసర్వేతో సెకండ్వేవ్లో వైరస్వ్యాప్తిని సమర్ధవంతంగా కట్టడిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 1204, కామారెడ్డి జిల్లాలో 856 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి.
నిజామాబాద్, జనవరి 21, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో జ్వరసర్వే శుక్రవారం నుంచి ప్రారంభమైంది. కరోనా వ్యాప్తిని ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఇంటింటి జ్వరసర్వే చేపట్టి సత్ఫలితాలను సాధించింది. సర్వే కొవిడ్ వ్యాప్తిని అరికట్టగలిగింది. గత కొద్దిరోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండడంతో ప్రభుత్వం మరోసారి జ్వరసర్వేను ప్రారంభించడం ప్రజలకు ఊరటనిస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో వైద్య బృందాలు తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నాయి. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి హోం ఐసొలేషన్ కిట్లు ఉచితంగా అందిస్తూ వారికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వైరస్ అనుమానిత వ్యక్తులను ఇంటి గడప దాటకుండా కట్టడి చేస్తూ.. వారి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా జ్వర సర్వే ఉపయుక్తం కానుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1204, కామారెడ్డి జిల్లాలో 856 వైద్య బృం దాలను నియమించగా, సర్వే ప్రారంభమైంది. జ్వర సర్వే ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడనుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
గత అనుభవం అద్భుతం
కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ను విజయవంతంగా చేపడు తూనే అవసరమైన వారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేర సహకారం లేకపోయినప్పటికీ ఆర్థిక భారాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఇళ్లకే పరిమితం చేయడం ద్వారా వ్యాప్తి రేటును తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా ఇంటింటికీ వైద్య బృందాలను పంపించి సర్వేను చేపడుతోంది. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్న వారిని ప్రాథమిక దశలోనే గుర్తించి హోం ఐసొలేషన్ కిట్లను అందించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం స్పష్టమైన ఆదేశాలివ్వడంతో సర్వే బృందాలు రంగం లోకి దిగాయి.
గ్రామాల్లో సత్ఫలితాలు
పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే అద్భుత ఫలితాలను ఇవ్వనుంది. పట్టణాల్లో వైద్యసా యం పొందేందుకు ప్రజలకు మెరుగైన అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఏ చిన్న ఇబ్బంది కలిగినా స్థానికంగా దవాఖానకు వెళ్లి అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. గ్రామాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నవారు కరోనా లక్షణాలను సీరియస్గా తీసుకోకపోవడంతో వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉం టుంది. ఈ నేపథ్యంలో జ్వరసర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న వైద్యబృందాలు అవసరమైన వారికి మందులు అందజేసి సలహాలు, సూచనలు ఇవ్వడం సత్ఫలితాలను ఇవ్వనుంది. ప్రస్తుత సర్వేతో సిబ్బంది ప్రతి ఇంటి తలుపూ తట్టడంతో మహమ్మారి వ్యాప్తి కట్టడికి అవకాశం ఏర్పడింది.
ఇదీ లెక్క..
నిజామాబాద్ జిల్లాలో మొదటి దశ జ్వరసర్వేను 2021, మే 6 నుంచి మే 13వ తేదీ వరకు నిర్వహించగా, 1204 బృందాలు పని చేశాయి.4,08,165 కుటుంబాలను కలిసిన వైద్య బృందాలు 7741 మందికి మెడికల్ కిట్లను అందించాయి. రెండో దశ మే 19 నుంచి మే 25వ తేదీ వరకు కొనసాగింది. 4,08,322 కుటుంబాలను కలిసిన సర్వేబృందాలు 3052 మంది అనుమానితుల కు ఔషధ కిట్లు ఇచ్చాయి. మూడో దశ జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పదిరోజులపాటు కొనసాగగా, 1,97,751 కుటుంబాలను కలిసి కరోనా లక్షణాలతో బాధపడుతున్న 343 మందిని గుర్తించి ఐసొలేషన్ కిట్లు అందజేశారు. శుక్రవారం నుంచి నిజామాబాద్ జిల్లాలో 1204 బృందాలు జ్వరసర్వేను ప్రారంభించాయి. మొదటిరోజు 10,693 ఇండ్లను సర్వే చేసి1,835 మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కామారెడ్డిలో మొదటి దశలో సర్వే నిర్వహించిన 856 బృందాలు 2,57,868 కుటుంబాలను కలిసి వివరాలు సేకరించాయి. కొవిడ్ లక్షణాలున్న 4,713 మందికి అవసరమైన మందులు అందజేశారు. రెండో దశలో 2,57,663 కుటుంబాలను కలిసి 1730 మందిని గుర్తించి వైద్య సహకారం అందించారు. మూడో దశలో 1,47,713 కుటుంబాలను సర్వే నిర్వహించి 305 మందికి వైద్య సలహాలిచ్చారు. నాలుగో దశలోనూ 856 బృందాలు సర్వే చేపడుతున్నాయి.
జ్వర సర్వేతో కొవిడ్నుంచి రక్షణ
బోధన్, జనవరి 21: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జ్వర సర్వే ద్వారా ప్రజలకు రక్షణ ఏర్పడుతుందని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఇంటింటికీ వెళ్తున్న సర్వే బృందాలు కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని ప్రాథమిక దశలోనే గుర్తించి హోం ఐసొలేషన్ కిట్లను అందజేస్తారని తెలిపారు. బోధన్ పట్టణంలోని 2, 20వ వార్డుల్లో శుక్రవారం చేపట్టిన జ్వరసర్వేను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వైరస్ వేగంగా వాప్తి చెందుతుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ జిల్లాలో 400 నుంచి 500 పాజిటివ్ కేసులు వస్తున్నాయన్నారు. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న కుటుంబాలను వెంటవెంటనే గుర్తించేందుకు జ్వరసర్వే కొనసాగుతున్నదన్నారు. నాలుగైదు రోజుల్లో సర్వే పూర్తవుతుందని, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర సమచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్నప్పటికీ, తీవ్రత తక్కువగా ఉందన్నారు. జిల్లా జనరల్ దవాఖానలో శుక్రవారం వరకు 47 మంది ఇన్పేషెంట్లు ఉన్నారని, దీన్నిబట్టి ఒమిక్రాన్తో ప్రాణాపాయం తక్కువగా ఉన్నట్లు అర్థమవుతున్నదన్నారు.
కరోనా వ్యాప్తి కట్టడికి జ్వర సర్వే దోహదం
కరోనా కట్టడికి ఇంటింటి సర్వే ఎంతగానో దోహదం చేస్తుంది. గతేడాది కరోనా ఉధృతిలో లక్షణాలున్న వారిని గుర్తించి ఇంటి వద్దే మెడికల్ కిట్లు అందజేయడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి. ప్రజలంతా సర్వేకు సహకరించడంతో వైరస్ ప్రబలకుండా చర్యలు చేపట్టాము. మూడో వేవ్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటి జ్వర సర్వేకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వందలాది బృందాలు సర్వే చేపడుతున్నాయి. ఎలాంటి లక్షణాలున్నా వైద్య సిబ్బందికి ప్రజలు స్వచ్ఛందంగా వివరాలు తెలియజేయాలి. వారి సలహాలు, సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. ప్రజలంతా కొవిడ్ 19 నిబంధనలను తప్పక పాటించాలి. నిర్లక్ష్యం చేయొద్దు. జాగ్రత్తలు తీసుకుంటూనే కొవిడ్ బారిన పడకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణతో మెలగాలి.