బంజారాహిల్స్ : బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద అవారాగా తిరిగే ఓ బాలుడు వీధికుక్కల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పార్కు బయట వాక్వేలో ఇందిరానగర్కు చెందిన ఓ బాలుడు (16) రోజూ తిరుగుతూ అక్కడ కనిపించే పక్షులను, జంతువులను హింసిస్తున్నాడు.
రెండ్రోజుల క్రితం బాలుడు అక్కడ కనిపించిన మూడు కుక్కపిల్లలను పట్టుకుని కర్రతో కొట్టి చంపడంతో పాటు పక్కనే ఉన్న గుంతలో పారవేస్తున్న విషయాన్ని గమనించిన ఓ వాకర్ ఈ విషయాన్ని కేబీఆర్ మెయిన్ గేట్ సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న ఇంటర్ సెప్టార్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది.
దాంతో బాలుడికోసం గాలించగా అప్పటికే అక్కడినుంచి వెళ్లిపోయాడు. మరుసటిరోజు అదే సమయానికి అక్కడకు వచ్చిన బాలుడిని పట్టుకున్న సిబ్బంది కుక్కపిల్లలను ఎందుకు చంపావని ప్రశ్నించారు. అయితే పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అతడిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
పార్క్ బయట వాక్వేలో రోజూ అతడు తిరుగుతుంటాడని, పావురాలను చంపడం, కనిపించే జంతువులమీద రాళ్లు విసరడం చేస్తుంటాడని తేలింది. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు మరోసారి ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలుడి మానసికస్థితిపై అనుమానాలు ఉండడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు.