రేవల్లి, జనవరి 22 : మండలంలోని గౌరిదేవిపల్లి సమీపంలో ఉన్న ఎంజీకేఎల్ లిఫ్ట్-3లో భాగమైన గుడిపల్లి రిజర్వాయర్లో గురువారం దూకి బావామరదళ్లు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.. నాగర్కర్నూల్కు చెందిన నరేష్కుమార్(27)కు ఆరేండ్ల కిందట మౌనికతో వివాహం జరిగింది. వీరికి మూడు నెలల పాప కూడా ఉన్నది. అయితే నరేష్కు మరదలు వరుస అయ్యే కల్వకుర్తికి చెందిన మల్లేష్ కూతురు కళ్యాణి (17)కి మధ్య నాలుగేండ్లుగా సాన్నిహిత్యం పెరిగింది. కళ్యాణి నాగర్కర్నూల్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. అయితే ఇద్దరూ పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇరువురు కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈనెల 13న కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన కళ్యాణి తిరిగి వెళ్లలేదు. ఇద్దరూ కలిసి పారిపోయారు. ఆమె తల్లిదండ్రులు వెతికినా లాభం లేకపోవడంతో 18న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే 20న ఇద్దరూ ఎంజీకేఎల్ఐ గుడిపల్లి రిజర్వాయర్ వద్దకు వెళ్లి సెల్ఫోన్, చెప్పులు అక్కడే ఉంచి నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మూడ్రోజుల నుంచి మృతదేహాల కోసం గాలించారు. లభ్యం కాకపోవడంతో మోటర్ల పంపింగ్ నిలిపి ఫైర్ సిబ్బందితో గాలింపు చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో బీచుపల్లి సమీపంలోని కొండపేట నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. శనివారం ఉదయం రిజర్వాయర్ నీటి అడుగు భాగంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. బయటకు తీసిన తర్వాత రేవల్లి ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. గాలింపు చర్యలను ఎస్సైతోపాటు స్థానిక తాసిల్దార్ శ్రీరాములు, జిల్లా ఫిషరీస్ అధికారి ఎండీ రహ్మాన్ పర్యవేక్షించారు.