చిత్ర కళలో రాణిస్తున్న ఆంతోటి ప్రభాకర్శిక్షణ తీసుకోలేదు.. గురువు సాయం అసలే లేదు.. అయినా తన చేతితో అద్భుత చిత్రాలు ఆవిష్కరిస్తున్నాడు. చిత్రకళలో అంచెలంచెలుగా ఎదిగి రైటింగ్తో పాటు కార్టూనిస్టు, క్యారికేచర్డ్గా జాతీయ స్థాయిలో నిర్వహించిన పలు పోటీలకు ఎంపికయ్యాడు. నేషనల్ లెవల్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు సింగరేణి కార్పొరేట్ ప్రధాన కార్యాలయ పర్సనల్ విభాగంలోని వెల్ఫేర్ వింగ్ ట్రాన్సిట్ గెస్ట్హౌస్లో విధులు నిర్వహిస్తున్న ఆంతోటి ప్రభాకర్. ఈయన గీసిన చిత్రాలు 36 దేశాల్లో చిత్రకళా ప్రదర్శన పోటీలకు సైతం ఎంపికయ్యాడు. ఆయనపై ప్రత్యేక కథనం..
కొత్తగూడెం సింగరేణి, జనవరి 22: భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా కొత్తగూడెం మండలం రామవరానికి చెందిన ఆంతోటి అదరయ్య-గ్రేషమ్మ దంపతుల పెద్ద కొడుకు ప్రభాకర్. ఈయనకు భార్య ప్రేమలత, ముగ్గురు పిల్లలు ప్రిన్సి ఆకాంక్ష, గ్రీష్మ సమంత, అక్షయ్ తేజ్ ఉన్నారు. రామవరంలో పదోతరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత డోర్నకల్లో ఇంటర్ చదువుకున్నాడు. అనంతరం ఓపెన్లో ఎంఏ హెచ్ఆర్ఎం చేశాడు. తాను ఏడోతరగతి చదువుతున్న సమయంలోనే పాఠశాలలో నిర్వహించిన డ్రాయింగ్ పోటీ ల్లో ప్రథమ బహుమతి సాధించాడు. అప్పటి నుంచి ఎవరి సాయం లేకుండా చిత్రకళపై పట్టుసాధించాడు. డ్రా యింగ్లో లోయర్, హైయర్ కోర్సుల్లో ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో పాటు టీటీసీ డ్రాయింగ్లో కూడా పాసయ్యాడు. హైదరాబాద్లో సెటిలవుదామనుకున్న సమయంలో 1997లో తన తండ్రి అదరయ్య నుంచి డిపెండెంట్ కింద ఉద్యోగం వచ్చింది. సింగరేణి కార్పొరేట్ ప్రధాన కార్యాలయ పర్సనల్ విభాగంలోని వెల్ఫేర్ వింగ్ ట్రాన్సిట్ గెస్ట్హౌస్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే సైన్బోర్డులు, బ్యానర్లు రాసేవాడు. ఓ ప్రముఖ దినపత్రికలో కార్టూనిస్టుగా పరీక్ష రాస్తే ప్రథమ శ్రేణిలో పాసవడంతో పాటు ఖమ్మ జిల్లా ఎడిషన్కు ఎంపికయ్యాడు. సింగరేణిలో ఉద్యోగం ఉండడం వల్ల వెళ్లలేకపోయాడు. అప్పటి నుంచి రైటింగ్తో పాటు కార్టూనిస్ట్, క్యారికేచర్డ్గా అంచెలంచెలుగా ఎదిగి జాతీయస్థాయిలో నిర్వహించిన పలు పోటీలకు ఎంపియ్యాడు. ఎన్నో అవార్డులు తన సొంతం చేసుకున్నాడు. ఆయన గీసిన చిత్రాలు కూడా ప్రదర్శించబడ్డాయి.
అవార్డులు..
2009లో ఆలిండియా ఇండస్ట్రియల్ పెయింటింగ్ కాంపిటేషన్లో, 2012లో వైజాగ్లో నిర్వహించిన చిత్రకళా పరిషత్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాడు. 2017లో ఖమ్మంలో జరిగిన కార్టూన్ అండ్ కారికేచర్ ప్రదర్శన, 2019లో ఇంటర్నేషనల్ కార్టూన్ వాచ్ మ్యాగజైన్ నిర్వహించిన పోటీల్లో ప్రత్యేక బహుమతి అందుకున్నాడు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డును సైతం గెలుచుకున్నాడు. 2020లో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ క్యారికేచర్ కాంపిటేషన్లో ద్వితీయ బహుమతి, కరోనా అవగాహన కార్టూన్ పోటీల్లో ప్రత్యేక బహుమతి లభించింది. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ క్యారికేచర్ ప్రత్యేక సంచికను విడుదల చేశారు. అందులో ఆయన ప్రత్యేక చిత్రాన్ని గీశారు. వీటితో పాటు అనేక దేశాల్లో జరిగిన క్యారికేచర్ పోటీల్లో ప్రభాకర్ బొమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘కొంటెబొమ్మల బ్రహ్మలు..’తెలుగు కార్టూనిస్టుల పుస్తకంలో ప్రభాకర్ గీసిన క్యారికేచర్ బొమ్మలు ప్రచురితమయ్యాయి.
అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలన్నదే జీవిత ఆశయం..
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొని, నా ప్రతిభను ప్రదర్శించాను. సింగరేణి సంస్థకు కూడా పేరు తెచ్చిపెట్టాను. అంతర్జాతీయ స్థాయిలో క్యారికేచర్డ్గా ఎదగాలన్నదే నా జీవితాశయం. బెస్ట్ క్యారికేచర్డ్గా అవార్డు సాధించాలని నా కోరిక. కుటుంబ సభ్యులు, సింగరేణి సంస్థ ప్రోత్సాహం బాగుంది. అందుకే ఎక్కడ పోటీలు జరిగినా వెళ్తున్నాను.