కొండాపూర్ : నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియం సమీపంలోని ఎస్ఎంఆర్ రాయల్ అపార్ట్మెంట్ దగ్గర తలెత్తిన డ్రైనేజీ సమస్యను డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, ఇంజనీరింగ్, జలమండలి విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారాన్ని చూపుతామని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా మౌళిక సదుపాయాల కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాలనీలో నెలకొన్న తాత్కాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
నియోజకవర్గ పరిధిలోని కాలనీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడ సమస్యలున్న వెంటనే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలిపారు. డ్రైనేజీ, మంచినీరు, వీధి దీపాలు, రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అభివృద్ధిలో కాలనీ వాసులు భాగస్వాములై ఆధర్శ కాలనీలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, జీహెచ్ఎంసీ ఈఈ శ్రీకాంతిని, జలమండలి మేనేజర్ సుబ్రమణ్యం, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, నాయకులు రాజు యాదవ్, ఉరిటి వెంకట్రావ్, వెంకటేశ్, రవీందర్, రాంబాబు, ఎండీ ఇబ్రహీం, కృష్ణ యాదవ్, కాశీనాథ్, రమేష్, వేణుగోపాల్, రమణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.