నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో కీలకంగా ఉన్న మాధవనగర్ రైల్వేక్రాసింగ్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం రూ.63.07 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాల కళ నెరవేరనుండడంపై నిజామాబాద్ రూరల్ మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. నిధుల విడుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి ప్రశాంత్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పెరుగుతున్న వాహనరద్దీకి అనుగుణంగా మాధవనగర్ వద్ద బ్రిడ్జి నిర్మించాలని ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చింది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా పనిచేసిన కవిత సైతం ఆర్వోబీ కోసం తీవ్రంగా కృషిచేశారు. అయితే కేంద్రప్రభుత్వం నుంచి స్పందనేదీ రాకపోవడంతో రాష్ట్రప్రభుత్వమే అదనపు ఖర్చును భరించేందుకు ముందుకొచ్చింది. మొత్తం వంతెన నిర్మాణానికి రూ.93.12 కోట్ల వ్యయం కానుండగా, రాష్ట్రప్రభుత్వం రూ.63.07 కోట్లు భరించనుంది. రైల్వే శాఖ కేవలం రూ.30.05 కోట్లు మాత్రమే వెచ్చించడం గమనార్హం.
నిజామాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు వెళ్లే దారిలో కీలకంగా మారిన మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.63.07 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం జీవో విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఆర్వోబీలకు పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరు చేస్తూ వెలువడిన ఉత్తర్వుల్లో నిజామాబాద్ జిల్లాలోని మాధవనగర్ ఆర్వోబీ కూడా ఉంది. పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా వంతెన నిర్మించాలని ఏడేండ్లుగా రాష్ట్ర సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా పని చేసిన కల్వకుంట్ల కవిత సైతం ఆర్వోబీ కోసం తీవ్రంగా శ్రమించారు. మొదట్లో రెండు వరుసల వంతెనకు మాత్రమే రైల్వే శాఖ అనుమతివ్వగా పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ఫోర్వే వంతెన నిర్మాణానికి సర్కారు ప్రయత్నాలు చేసింది. అయితే… కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాత్సారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి వంతెన నిర్మాణానికి నిధులు భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయగా రైల్వే శాఖ అంగీకారం చెప్పింది. వాస్తవానికి ఆర్వోబీకి రైల్వే శాఖనే పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించాల్సి ఉన్నప్పటికీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. ప్రజల అవసరాలను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నది. దీంతో వంతెన నిర్మాణానికి ముందడుగు పడినట్లు అయ్యింది. మొత్తం రూ.93.12 కోట్లు వ్యయం కానుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.63.07 కోట్లు భరించనున్నది. రైల్వే శాఖ కేవలం రూ.30.05 కోట్లు మాత్రమే వెచ్చించనున్నది.
మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత చొరవ…
మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ చూపారు. నిజామాబాద్ ఎంపీగా 2014 నుంచి 2019 వరకు పని చేసిన కవిత.. కేంద్రంతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపి ఆర్వోబీ కోసం కృషి చేశారు. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మం త్రిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.కోట్ల నిధులను కేటాయిస్తున్నారు. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలనే లక్ష్యంతో ఆర్ అండ్ బీ శాఖ ద్వారా దక్షిణ మధ్య రైల్వేపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నారు. అనుమతులు మంజూరు చేస్తే చకచకా పనులు మొదలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నాలుగు లైన్ల ఆర్వోబీ నిర్మాణంతో నగర ప్రజలకు 30 ఏండ్లపాటు ట్రాఫిక్ సమస్యలు ఉండవు. రెండు లైన్ల బ్రిడ్జితో ఇబ్బందులు తప్పవన్న విషయాలను పరిగణలోకి తీసుకోని రైల్వే శాఖ.. నిబంధనల పేరుతో లక్షలాది మంది ఆకాంక్షకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఎట్టకేలకు టీవీయూ 3 లక్షలు దాటినందున ప్రస్తుతం మాధవనగర్ వద్ద నాలుగు లైన్ల ఆర్వోబీకి లైన్ క్లియరైంది. భూసేకరణ, నిధుల మంజూరులో మంత్రి ప్రశాంత్రెడ్డి చొరవతో త్వరలోనే ఆర్వోబీ పనులు ప్రారంభం కానున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సైతం పలు దఫాలుగా బ్రిడ్జి నిర్మాణం ఆవశ్యకతపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ దృష్టికి సైతం సమస్యను తీసుకెళ్లారు.