కమ్మర్పల్లి, జనవరి 21 : రాష్ట్రంలో లక్షా 32 వేల ఉద్యోగాలను ఇచ్చినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశాన్ని ఏలుతున్న వారు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో రూ.2.50 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ పనులకు శంపస్థాపన చేసి జడ్పీ హైస్కూల్లోరూ.30 లక్షలతో నిర్మించిన అదనపు గదులు, పాటి హనుమాన్ వద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. మినీ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వ ట్లేదని ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ ఉద్యోగాల కల్పనను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదన్నారు. రాష్ట్రంలో లక్షా 32 వేల మందికి ప్రభు త్వ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇందులో 40 వేల నియామకాలు టీఎస్పీఎస్సీ ద్వారానే జరిగాయని వివరించారు. బీజేపీ పాలిత రాష్ర్టాలైన యూపీలో 19 వేలు, బీహార్లో 8,950, కర్ణాటకలో 14, 893, మహారాష్ట్రలో ఎనిమిది వేల ఉద్యోగాలను మాత్రమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చారని తెలిపారు. ఈ లెక్కలు అబద్ధమైతే తాను తన మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమన్నారు. నిజమైతే బీజేపీ నేతలు రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఏడేండ్లలో కొత్త పరిశ్రమలు వచ్చి ప్రైవేట్లో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు లభించాయని గుర్తు చేశారు. నాడు రూ.50 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే నేడు లక్షా 50 వేల కోట్లకు పెరిగాయన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయని తాను చూపిస్తానన్నారు.
తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీ రామ రక్ష
తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీ రామ రక్ష అని పేర్కొన్నారు. ఆయన ఉన్నంతకాలం తెలంగాణ తల దించుకోదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఉద్యోగుల బదిలీల్లో పది శాతం మందికి మాత్రమే కొంత ఇబ్బంది కలుగుతోందని.. ప్రతిపక్ష నాయకులు దీనిని రాజకీయం చేస్తున్నారని అన్నారు. అందరికీ మళ్లీ సర్దుబాటు జరుగుతుందన్నారు.
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
కమ్మర్పల్లిలో అన్ని హంగులతో మినీ స్టేడియం నిర్మించుకోవడం అనందంగా ఉందన్నారు. ఇది యువతకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. నియోజక వర్గానికి ఒక్క మినీ స్టేడియం మంజూరుకు మాత్రమే అవకాశం ఉం టుందన్నారు. అప్పటికే వేల్పూర్లో మినీ స్టేడియం ఉన్నా కమ్మర్పల్లి యువత, క్రీడాకారుల ఆక్షాంక్ష నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా వివరించి మంజూరు చేయించానని తెలిపారు.ఈ స్టేడియం నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలని సోర్ట్స్ అథారిటీ అధికారులకు సూచించారు. ఇందులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకుందామన్నారు. గతంలో వాలీబాల్ ఆటను వెంకట రమణారెడ్డి నిలబెట్టారని, రాష్ట్రంలో వాలీబాల్ అభివృద్ధికి హన్మంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా మోజులో పడి యువత, పిల్లలు పెడదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, మంచి ఆలోచనలు, ఆరోగ్యం అందుతాయన్నారు. తాను కూడా వాలీబాల్, క్రికెట్లో రాష్ట్ర స్థాయి క్రీడాకారుడినే అన్నారు. జిల్లా అధికారిక క్రికెట్ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన తన తండ్రి వేముల సురేందర్రెడ్డితో కలిసి బ్యా టింగ్ చేసిన రోజులు మరువలేనని గుర్తుచేసుకున్నారు. అనంతరం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆరుగురు సాఫ్ట్బాల్ క్రీడాకారిణులతోపాటు జిల్లా జట్టును మంత్రి ఘనంగా సన్మానించి అభినందించారు. మినీ స్టేడియం కల సాకారం చేసిన మంత్రిని యువకులు, వాలీ బాల్, షటిల్ క్రీడాకారులు, వాలీ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, వాలీ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లేశ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న, ఎంపీపీ లోలపు గౌతమి, జడ్పీటీసీ పెరుమాండ్ల రాధ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, సర్పంచ్ స్వామి, ఎంపీటీసీ మైలారం సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మలావత్ ప్రకాశ్, నాయకులు భాస్కర్ యాదవ్, బద్దం చిన్నారెడ్డి, పెరమాండ్ల రాజాగౌడ్, టీఆర్ఎస్ నియోజక వర్గ సమన్వయ కమిటీ సభ్యుడు లుక్క గంగాధర్, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ రాజేశ్వర్ పాల్గొన్నారు.
మోర్తాడ్లో రోడ్డు పునరుద్ధరణ పనులు ప్రారంభం
మోర్తాడ్, జనవరి 21 : మండలంలోని తిమ్మాపూర్ నుం చి కమ్మర్పల్లి మండలంలోని జిల్లా సరిహద్దు వరకు 63వ నంబరు జాతీయ రహదారి పునరుద్ధరణ పనులను మంత్రి వేముల శుక్రవారం ప్రారంభించారు. రూ. 5 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నారు. డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ రవి, సర్పంచ్ బోగ ధరణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, పర్స దేవన్న పాల్గొన్నారు.