జహీరాబాద్, జనవరి 30 : సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి సేవలు అందుతున్నాయని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను మంత్రి హరీశ్రావు చేశారు. అనంతరం సమీకృత మార్కెట్, అభివృద్ధిపై మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22వేల ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జహీరాబాద్లో 50 పడకల ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఉన్నత విలువలు కలిగిన నాయకుడని కొనియాడారు.
సర్కారు దవాఖానలో రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్య చికిత్సలు అందించేందుకు ప్రభు త్వం సౌకర్యాలు కల్పిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సర్కారు దవాఖానలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించి, దవాఖానలో పర్యటించి, అక్కడ అందుతున్న వైద్య చికిత్సలు అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 86 ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసి రోగులకు ఎలాంటి ఆక్సిజన్ కొరత లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో రాష్ట్రంలో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడిందన్నారు. కానీ, రాష్ట్రంలో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని, 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను తమిళనాడు, గోవా రాష్ర్టాల నుంచి తెప్పించామన్నారు. ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచేందుకు ఆదేశాలు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసుకున్నామన్నారు. మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పాశమైలారంలో ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అగ్రిమెంట్ అయ్యిందని చెప్పారు. పాశమైలారంలో ఆక్సిజన్ ప్లాంట్ను త్వరలో ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో 27వేల పడకలుంటే, ప్రతీ పడకకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామన్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండదన్నారు. వైద్య రంగంలో గుణాత్మక మార్పు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జ్వర సర్వే చేసి మంచి ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్రంలో రెండు, మూడు రోజుల్లో కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గిపోగే అవకాశముందన్నారు. కరోనా వైరస్పై ఎవరు నిర్లక్ష్యం చేయరాదన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలన్నారు. దేశంలోనే పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించడంతో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు.
జహీరాబాద్ ఏరియా దవాఖాన అభివృద్ధికి కృషి..
జహీరాబాద్ ఏరియా దవాఖానలో సౌకర్యాలు కల్పించేందుకు రూ.50 లక్షలు మంజూరు చేస్తానని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. దవాఖానలో ఉన్న వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. కొత్తగా 50 పడకల ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏరియా దవాఖానలో త్వరలో ప్రారంభిస్తామన్నారు. కేసీఆర్ కిట్స్తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. ప్రస్తుతం 52శాతం నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయని, 75శాతానికి పెంచేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. జహీరాబాద్ దవాఖానలో నార్మల్ ప్రసవలు సంఖ్య బాగా ఉందన్నారు. అనవసరంగా ఆపరేషన్లు చేయడంతో తల్లికి నణస్టం జరుగుతుందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో 66శాతం మంది శిశువులకు జన్మించిన తొలి గంటలో అందాల్సిన అమృతమైన పాలు అందడం లేదన్నారు. సర్జరీలతో మహిళలకు 35ఏండ్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్లో ఏరియా దవాఖానలో ఆపరేషన్లు చేయాలని ఆదేశాలిచ్చారు. సర్కారు దవాఖానకు వచ్చే రోగులకు చక్కటి, మెరుగైన వైద్యం అందించాలన్నారు. రోగులను వైద్యులు, సిబ్బంది ప్రేమగా పలకరించాలని, మర్యాదగా వ్యవరించాలన్నారు. వృత్తి ధర్మాన్ని మరువద్దని సూచించారు.
డీసీఎంఎస్ భవనం ప్రారంభం..
జహీరాబాద్ పట్టణంలో కొత్తగా నిర్మించిన డీసీఎంఎస్ భవనాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. భవనంలో ఎలాంటి వ్యాపారులు జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. జహీరాబాద్లో రూ.40లక్షలతో నిర్మించినున్న వ్యవసాయ శాఖ కార్యాలయ భవన, అర్జున్నాయక్తండా, అనెగుంట గ్రామాల రోడ్డు పనులకు మంత్రి భూమి పూజ చేశారు.
విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభం..
పర్వాతాపూర్, గోవింద్పూర్ గ్రామాల్లో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. వ్యవసాయనికి నాణ్యమైన కరెంట్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కొత్తగా సబ్స్టేషన్లు నిర్మించిందన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ రాజార్షి షా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం. శివకుమార్, సంగారెడ్డి జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీజైపాల్రెడ్డి, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జహీరాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి..
జహీరాబాద్ మున్సిపల్క అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జహీరాబాద్లో నూనతంగా నిర్మిస్తున్న సమీకృత కూరగాయల మార్కెట్ భవనంలో వివిధ శాఖల అధికారులతో మున్సిపల్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమీకృత కూరగాయల మార్కెట్ పనులు వేగవతంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపారులు సమీకృత మార్కెట్లో అమ్మకాలు చేసుకొని, ఉపాధి పొందేందుకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, మురికి కాల్వల కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎక్కడా రోడ్డు లేదు.. మురికి కాల్వలు లేదు.. అనే ప్రశ్న ఉండొద్దన్నారు. ప్రతీ ఇంటికి తాగునీరు సరఫరా చేయాలని, అవసరమున్న చోట పనులు చేయాలన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో పట్టణ అభివృద్ధి పనులు పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ప్రతీ వారం మున్సిపల్పై అడిషనల్ కలెక్టర్ రాజార్షి షా, ఎమ్మెల్యే మాణిక్రావు సమీక్షలు చేయాలన్నారు. నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్లో పనులు చేసేందుకు నిధుల కొరత లేదని, ఎక్కడ సమస్య ఉన్నా, వెం టనే పరిష్కరించాలన్నారు.
అంబేదర్, పద్మశాలీ భవనాలకు కృషి..
జహీరాబాద్ పట్టణంలో కొత్తగా అంబేద్కర్, పద్మశాలీ భవనాలు నిర్మించేందుకు భూమి కేటాయించి, నిధులు మంజూరు చేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. టీఆర్ఎస్ నేత నామ రవికిరణ్, టీఆర్ఎస్ నాయకులు, విశ్రాంతి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జనార్థన్ ఇంటికి వెళ్లి టీ తాగి వచ్చారు.
జహీరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం..
జహీరాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. పట్టణంలోని సర్కారు దవాఖానలో మహీంద్రా అండ్ మహీంద్రా యాజమాన్యం రూ.కోటితో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్, డీసీఎంఎస్ భవనం, వ్యవసాయ శాఖ కార్యాలయ భవనానికి భూమి పూజ చేశారు. ప్రతీ తండా, గ్రామాలకు మెరుగైన రోడ్డు సౌకర్యం కలిపించేందుకు కొత్త నిధులు మంజూరు చేసి, రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. నిధుల కొరత లేదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.