కొన్ని పాఠశాలలో అడ్మిషన్లు ఫుల్
70 శాతానికి పైగా హాజరు
జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కొనసాగుతున్న తరగతులు
పిల్లలతో సందడిగా పాఠశాలలు, కళాశాలలు
ముందస్తు జాగ్రత్త చర్యలతో ప్రభావం చూపని కరోనా
ఊపిరి పీల్చుకుంటున్న విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు
జగిత్యాల, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): కరోనాతో ఛిన్నాభిన్నమైన విద్యావ్యవస్థ గాడిన పడుతున్నది.. క్రమేణా ప్రవేశాలు, హాజరుశాతం పెరుగుతుండడంతో స్కూళ్లు, కళాశాలల్లో సందడి కనిపిస్తున్నది. విద్యాశాఖ పకడ్బందీ చర్యలతో తరగతులు ప్రారంభమై నెల రోజులైనా వైరస్ ప్రభావం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సైతం పిల్లలను ధైర్యంగా పాఠశాలలకు పంపేందుకు మొగ్గుచూపడం కనిపిస్తున్నది. దసరా సెలవుల తర్వాత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశమున్నదని విద్యాశాఖ యంత్రాంగం అభిప్రాయ పడుతున్నది.
కరోనా కేసులు ఆందోళనకర స్థాయికి చేరుకోవడంతో 2020 మార్చి 22న సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. నాటి నుంచి విద్యాసంస్థలు మూతపడడంతో సుమారు ఏడాదిన్నర కాలంగా విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు, వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో 2020 ఆగస్టులో విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు యత్నించినా నిపుణుల సూచనలతో వెనక్కితగ్గారు. తిరిగి 2021 ఫిబ్రవరి 1న ప్రత్యక్ష బోధనను ప్రారంభించారు. అయితే పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు, పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు సైతం ముందుకురాలేదు. దీంతో సర్కారు ఆన్లైన్ తరగతులను ప్రారంభించింది. ఫిబ్రవరి చివరి నుంచి కరోనా సెకండ్వేవ్ విజృంభించడంతో నాటినుంచి పరోక్ష బోధనను కొనసాగిస్తూ వస్తున్నారు. జూన్, జూలైలో వైరస్ అదుపులోకి రావడంతో ఆగస్టు 15 నుంచి విద్యాసంవత్సరా న్ని ప్రారంభించాలని నిర్ణయించి అనివార్య కారణాలవల్ల వాయిదా వేశారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలను తెరిచారు. అయి తే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల రాకను తప్పనిసరి చేయవద్దని, ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసులను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేయడంతో ఆటంకాలు తొలిగిపోయాయి.
తొలిరోజూ 21.86 శాతం హాజరు..
విద్యాసంస్థలను తెరిచిన తొలిరోజూ కొద్దిమంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలో 796 పాఠశాలలు (ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, వివిధ యాజమాన్యాల అధీనంలో) ఉండగా, ఇందులో మొదటి రోజు 57,851మంది విద్యార్థుల సంఖ్య నమోదైంది. నాలుగు ఎయిడెడ్ సూ ్కళ్లలో 121 మంది విద్యార్థులు ఎన్రోల్ అయ్యా రు. ఇక 303 ప్రైవేట్ స్కూళ్లలో 63,579మంది విద్యార్థుల పేర్లు నమోదై ఉన్నాయి. మొదటి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో 18,807 మంది, ప్రైవేట్ పాఠశాలల్లో 7739 మంది విద్యార్థులు హాజరయ్యారు. కేవలం 21.86 హాజరు శాతం మాత్ర మే నమోదైంది. అయితే మరుసటి రోజు నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 3న 31,835 మంది ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు, 12,026 మంది ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు హాజరయ్యారు. 4న 32,981 మంది ప్రభుత్వ, 12,7 74 మంది ప్రైవేట్ పాఠశాలల్లో హాజరుశాతం నమోదైంది. 9న 36,161 మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 18,655 ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులు పాఠాలు విన్నారు. 15న 40,793 మంది ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులు స్కూళ్లకు రాగా, 25,3 08 మంది ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు బడులకు వచ్చారు. 2548, 810 మంది ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుశాతం ఉండగా, 35,254 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. మొత్తంగా 25వ తేదీ వరకు జిల్లాలో దాదాపు 83వేల మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతుండడం గమనార్హం.
పెరుగుతున్న కొత్త అడ్మిషన్లు..
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆడ్మిషన్ల సంఖ్య క్రమేణా పెరుగుతున్నది. విద్యా సంవత్సరం తొలిరోజు సర్కారు విద్యాసంస్థల్లో 57,851 మంది ఉండగా, ప్రైవేట్ స్కూళ్లలో 63,570 విద్యార్థుల సంఖ్య ఉన్నది. తాజాగా 25వ తేదీ నాడు పరిశీలిస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 68,216గా ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లో 69,210కు చేరింది. 25 రోజుల వ్యవధిలో ప్రభుత్వ పాఠశాలల్లో 10,365, ప్రైవేట్ పాఠశాలల్లో 5640 కొత్త అడ్మిషన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సంఖ్య 16వేలకు పైగా నమోదు కావడం గమనార్హం.
ఫలితమిచ్చిన పకడ్బందీ చర్యలు..
కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందని, పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు నిపుణులు హెచ్చరించడం, సోషల్మీడియాలో సైతం విసృ్తతంగా ప్రచారం కావడంతో తల్లిదండ్రులు పిల్లలను బడులకు పంపేందుకు ఒకింత ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా కట్డడికి చేపట్టిన పకడ్బందీ చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఒకటి, రెండు చోట్ల తప్పా ఎక్కడా పిల్లలకు, ఉపాధ్యాయులకు పాజిటివ్ నమోదు కాలేదు. ప్రతి పాఠశాలలో శానిటైజ్ చేయడం, స బ్బులు, శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో పెట్టడం, తరగతి గదిలో పిల్లల మధ్య నిర్ణీత దూరం పాటింపజేయడం, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కరోనా నివారణ చర్యలు తీసుకోవడంతో వైరస్ ముప్పు తప్పిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
కాలేజీల్లోనూ కొనసాగుతున్న బోధన
ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోను విద్యాబోధన నిరాటంకంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది ఆగస్టు 26 నుంచి జూనియర్ కాలేజీల్లో ప్రత్యక్ష బోధనకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కాగా. సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభించారు. జిల్లాలో 15 ప్రభుత్వ, 27 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో దాదాపు 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక డిగ్రీ కాలేజీలు ఈ ఏడాది జూలై నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నా, విద్యార్థుల హాజరు విషయాన్ని ఐచ్ఛికం చేశారు. దీంతో ఎక్కువ శాతం డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ తరగతులే నిర్వహించారు. అయితే సెప్టెంబర్ 1నుంచి జిల్లాలోని నాలుగు ప్రభుత్వ డిగ్రీ, ఏడు ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో విద్యాభోధన సాగుతున్నది.