తొలిరోజు ఎకరా లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ
మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,49,914 మంది రైతులకు అందజేత
ఆనందంలో అన్నదాతలు.. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 28 : యాసంగికి సంబంధించి పెట్టుబడి సాయం పంపిణీ షురూ అయ్యింది. మంగళవారం ఎకరాలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేశారు. వారం రోజుల్లో రైతులందరికీ సాయం అందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెట్టుబడి సాయం అందినట్లు సెల్ఫోన్కు సమాచారం అందడంతో రైతుల కండ్లల్లో ఆనందం కనిపించింది. సీఎం కేసీఆర్ అన్నదాతల పక్షపాతి అని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొదటిరోజు 96,142 మంది అన్నదాతలకు రూ.28.04 కోట్లు అందజేయగా.. వికారాబాద్ జిల్లాలో 53,772 మందికి రూ.17.80 కోట్లు పంపిణీ చేశారు.
యాసంగి సీజన్కు సంబంధించి మంగళవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. అయితే తొలుత ఎకరా వరకు భూమిగల రైతులకు రైతు బంధు సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం, బుధవారం రెండు ఎకరాల భూమిగల రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.5వేల చొప్పున యాసంగి పెట్టుబడి సాయాన్ని జమ చేయనున్నారు. రైతులు అప్పుల బారిన పడకుండా రైతుబంధు పథకంతో సాగు చేసుకునేందుకుగాను ఆర్థిక సహాయం అందజేస్తున్న సీఎం కేసీఆర్కు రైతులు జేజేలు పలికారు.
జిల్లాలో యాసంగి సీజన్కుగాను 3,48,556 మంది పట్టాదారులను రైతు బంధు పథకానికి అర్హులుగా గుర్తించారు. అయితే వానకాలం సీజన్తో పోలిస్తే ఈ ఏడాది రైతుల సంఖ్య పెరిగింది. వానకాలం సీజన్లో 3,24,795 మంది రైతులకు రైతు బంధు అందించగా యాసంగి సీజన్లో 23 వేలకుపైగా రైతులు అర్హుల జాబితాలో చేరారు. రైతుబంధు కింద నాలుగేండ్లలో ప్రభుత్వం రూ.1966 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేసింది. జిల్లాలో నేడు 96142 మంది రైతులకు రూ.28.04 కోట్లు వారి ఖాతాల్లో జమయ్యాయి.
ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 28 : అన్నదాతల ఆరాధ్య దైవం ముఖ్యమంత్రి కేసీఆర్ అని రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బూడిద నర్సింహారెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంట పెట్టుబడి 8వ విడుత రైతు బంధు సాయం రైతుల ఖాతాల్లో జమచేయడాన్ని హర్షిస్తూ మంగళవారం ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ రైతు వేదికలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో పంటల పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది ఎకరాకు పదివేలు అందజేసి ఆదుకుంటున్నారని తెలిపారు. రైతుల కష్టాలు తెలిసిన గొప్ప నాయకుడు సీఎం కావడం రాష్ట్ర రైతాంగం అదృష్టమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా సభ్యులు కాయితి మోహన్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మడుపు గోపాల్, రైతులు ఉన్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం : శీను, ఊరెళ్ల
పంట పెట్టుబడికి సకాలంలో డబ్బు అందించి ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. గతంలో ఏ ప్రభుత్వమూ రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను ఆదుకుంటున్నారు.
ఎంతో సంతోషంగా ఉంది;నర్సింహారెడ్డి, రైతు, ఉప్పరిగూడ
రైతు బంధు పథకం రైతుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నది. పంటలు వేసే సమయంలో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తుండటంతో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అప్పుల బాధ తప్పింది..
రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. సమయానికి పంటల పెట్టుబడి అందించి ఆదుకుంటున్నారు. గతంలో పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో అప్పులు చేసి తిప్పలు పడేవాళ్లం. ఇప్పుడు ఆ బాధ తప్పింది. ఈ డబ్బులతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటాం. ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు.-శ్రీనివాస్,రైతు, చేవెళ్ల