నగరంలో తొలిసారిగా.. ఫ్లై ఓవర్ కింద వాకింగ్ పార్కు
ముంబై తరహాలో ఏర్పాటు చేస్తున్న జీహెచ్ఎంసీ
రూ. 3 కోట్లతో ప్రత్యేకాకర్షణతో తీర్చిదిద్దుతున్న అధికారులు
సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): నయాపైసా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే అద్భుత ఔషధం నడక. క్రమం తప్పక నడిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆనందానికి ఆనందం. ప్రస్తుతం ఏ డాక్టర్ను కలిసినా ఒకటే మాట.. రోజూ కనీసం 45 నిమిషాలైనా నడవాలని చెబుతున్నారు. కుదిరితే అంతకంటే ఎక్కువే నడవవచ్చని సూచిస్తున్నారు. నడకతో అధిక బరువు, మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, మానసిక సమస్యలనూ పోగొట్టుకోవచ్చు. ఇంతటి అద్భుతమైన వ్యాయామం కోసం జీహెచ్ఎంసీ చక్కని వేదికను సిద్ధం చేస్తున్నది. నగరంలో తొలిసారిగా వంతెన కింద వాకింగ్ పార్కును తీర్చిదిద్దుతున్నది. ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా షేక్పేట నాలా చౌరస్తా నుంచి రాయదుర్గం వరకు సుమారు 2.8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ను ఇందుకు ఎంపిక చేసిన జీహెచ్ఎంసీ బయో డైవర్సిటీ అధికారులు రూ.3 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం, ముగింపులో ఉన్న ర్యాంపుల వద్ద వాకింగ్ పార్కు పనులను చేపడుతున్నారు. దాదాపుగా 600 మీటర్లకు పైగా ఉన్న ఈ వాకింగ్ ట్రాక్లో ఆక్సిజన్ను అందించే దాదాపు 38 వేల రకాల మొక్కలను పెంచుతున్నారు. ఈ పార్కులో నడవడం ద్వారా ఫిట్నెస్తో పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందడం ఖాయమని అధికారులు వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న హరితహారం స్ఫూర్తితో ఈ పార్కు నిర్మాణం జరుగుతున్నదని.. వచ్చే నెలాఖరు నాటికి ఈ పార్కు పనులను పూర్తి చేసి మంత్రి కేటీఆర్చే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారి తెలిపారు.