లక్ష్మణచాంద, నవంబర్ 28: వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా రైతులకు రైతువేదికల ద్వారా అవగాహన కల్పించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని వడ్యాల్, రాచాపూర్ వరి కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలలోని ఎలాక్ట్రానిక్ వేయింగ్మిషన్స్, ప్యాడి క్లీనర్లను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో దాన్యం తడిచిపోకుండా జగ్రత్తలు తీసుకోవాలని నిర్వహకులకు సూచించారు. వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 42 వేల 545 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు తెలిపారు. దాన్యం కొనుగోలు చేయగానే ఎప్పటికప్పుడు ట్యాబ్లలో నమోదుచేయాలని నిర్వహకులకు సూచించారు. రైతులు నాణ్యమైన దాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు. వరిదాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలన్నారు. అనంతరం వడ్యాల్ ఉన్నత పాఠశాలలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. కొత్తగా పెల్లయిన వారి పేర్లను ఓటరుగా నమోదుచేయాలని సూచించారు. ఏఎస్పీ రాంరెడ్డి, డీపీఎం శ్రీకల, డీఎస్వో సుధారాణి, తహసీల్దార్ కవితారెడ్డి ఉన్నారు.